
సాక్షి, గుంటూరు : ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో సోమవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల్లో జగన్కు వస్తున్న ఆదరణ చూసి భయపడి చంద్రబాబు మాట మార్చారన్నారు.
ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ గొప్పదని, హోదా ముగిసిన అధ్యాయమని, హోదా కోసం పోరాడితే విద్యార్థులను జైలుకు పంపుతానని చంద్రబాబు చెప్పిన విషయాలను గుర్తు చేశారు. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి వైఎస్ జగన్పై కేసులు పెట్టాలని, నియోజకవర్గాలను పెంచాలని కోరారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తెలిపారు. స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.