
సాక్షి, అమరావతి: టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ వివిధ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వల్లే ఆంధ్రప్రదేశ్లో ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణలు, ఆరోపణలు, అనుమానాస్పద వాతావరణంలో ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించినట్టు కొందరు చెబుతున్నారని.. అలా పొడిగించినట్టు ఆధారాలు చూపితే తాము కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని పట్టుబడతామని చెప్పారు.