మాట తప్పని నేత వైఎస్‌ జగన్‌ : భూమన

Bhumana Karunakar Reddy Praised YS Jagan About His Promise - Sakshi

సాక్షి, తిరుపతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పరని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే ఆటో కార్మికులను ఆదుకుంటారని భూమన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం నిర్వహించిన ఆటో కార్మికుల సమావేశంలో భూమన పాల్గొన్నారు. ఆటో కార్మికులతో భూమన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఆటో కార్మికులు ఏనాడూ ఇబ్బందులు పడలేదన్నారు. కానీ చంద్రబాబు పాలనలో ఆటో కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఆటో కార్మికుడికి 10 వేల రూపాయలు ఇస్తామని ఇప్పటికే మాట ఇచ్చిన వైఎస్‌ జగన్‌ తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కేతం జయచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆటో యూనియన్‌ సమావేశమైంది.

నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల నష్టపోతున్న ఏపీ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన జననేత వైఎస్‌ జగన్‌ ఇటీవల తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటోకార్మికులను కలుసుకున్నారు. డీజిల్‌ ధరలు పెరిగాయని, తమ వద్ద పోలీసులు ఇతరత్రా వసూళ్లు చేస్తున్నారని కార్మికులు జననేతకు సమస్యలు చెప్పుకున్నారు. తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకుంటామన్న వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top