ప్చ్‌..నో చాన్స్‌ | Bad luck For Marri Shasidhar And Nayani Narsimha Reddy | Sakshi
Sakshi News home page

ప్చ్‌..నో చాన్స్‌

Nov 19 2018 11:08 AM | Updated on Nov 19 2018 3:29 PM

Bad luck For Marri Shasidhar And Nayani Narsimha Reddy - Sakshi

సాక్షి,సిటీబూరో: ముషీరాబాద్‌తో నలభై ఏళ్ల అనుబంధం.. ఈ మారు టికెట్‌ నాకే కావాలంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం గజ్వేల్‌లోని కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో నాయిని భేటీ అయినా.. ముషీరాబాద్‌లో బీసీ అభ్యర్థి ముఠో గోపాల్‌కే ఇస్తామని స్పష్టం చేశారు. మీ భవిష్యత్‌కు నాది భరోసా అంటూ కేసీఆర్‌ స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక నాయిని హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. అనంతరం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. సీఎం నిర్ణయమే శిరోధార్యమని, ఆయన పిలుపు మేరకు ముఠా గోపాల్‌ విజయం కోసం పనిచేస్తానని ప్రకటించారు. మరో వైపు టీడీపీ పొత్తుతో తన స్థానాన్ని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డికి ఢిల్లీలో సైతం ఆశించిన ఫలితం దక్కలేదు.

శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఆదివారం తిరిగి నగరానికి చేరుకున్నారు. సనత్‌నగర్‌లో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం, సికింద్రాబాద్‌లో పోటీ చేయమని శశిధర్‌రెడ్డికి సూచించినా, ఆయన అందుకు సుముఖంగా లేకపోవడంతో, నీ భవిష్యత్‌కు ఏం ఢోకా ఉండదంటూ హైకమాండ్‌ ఇచ్చిన బరోసాతో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనని, కాంగ్రెస్‌ను వీడనని శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. 1989 నుంచి నియోజకవర్గంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శశిధర్‌రెడ్డి పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement