ఐర్లాండ్లో దసరా, బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్లో దసరా, బతుకమ్మ వేడుకలు డబ్లిన్లోని ఉపాధ్యక్షులు మెట్టు జయంత్ రెడ్డి ఆద్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ఇందులో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడారు. పురుషులకు ప్రత్యేకంగా జమ్మి పూజ, అలై బలై కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి యూరప్ అధ్యక్షులు సంపత్ ధనంనేని, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు, మేయర్ మేరీ మాక్ కేంలేయ్, కౌన్సిలర్ టేడ్ లేడే, ఇండియన్ హై కమిషన్ ఫస్ట్ సెక్రటరీ అనిత శుఖ్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
జాగృతి యూరప్ అధ్యక్షులు సంపత్ ధనంనేని మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో జాగృతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బతుకమ్మ పండుగలతోపాటు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రాచీన కవులను స్మరిస్తూ కవితాంజలి, యువత నైపుణ్యతకు స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఐర్లాండ్ తెలంగాణ ప్రజలలో దసరా బతుకమ్మ పండుగలను జరుపుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిలాగ జాగృతి పని చేయాలని తెలిపారు. జయశంకర్, కాళోజీ, దాశరధిలాంటి మహనీయుల ఆశయాల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి జాగృతి యూరప్ అధ్యక్షులు సంపత్ ధనంనేని, ఐర్లాండ్ జాగృతి ఉపాధ్యక్షులు జయంత్ రెడ్డి, తేరా శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ మధిర, రమణ యాదగిరి , జనగాం నవీన్, దుగ్యాల అనిల్ , రామ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.