ఆటా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

ATA Celebrates Womens Day In Cities Across USA - Sakshi

న్యూజెర్సీ : అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(ఆటా) ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. ‘బెటర్‌ ఫర్‌ బ్యాలెన్స్‌’ అనే థీమ్‌తో అమెరికా నలుమూలల ఈ వేడుకలను ఆట నిర్వహించింది. డల్లాస్‌, రాలీ, వాషింగ్టన్‌ డీసీ, డెలావేర్‌ వాలీ, న్యూ జెర్సీ, నాశ్విల్లే, ఆస్టిన్‌ వంటి 15 నగరాలలో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన ఎన్నో విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మహిళా దినోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన, భాగస్వాములైన స్పాన్సర్స్‌, వాలంటీర్స్‌కు ఆట అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 గ్రేటర్‌ నాశ్విల్లెలో ఆటా ప్రతినిధులు భారతీయ భాషలను నేర్పిస్తున్న అధ్యాపకులకు సన్మానం చేశారు. 'ఫ్రీ ఫర్ లైఫ్' ఫౌండేషన్ వారు మనుషుల అక్రమ రవాణా గురించి వివరించారు. అనంతరం బాధిత మహిళల కోసం ఆటా అక్కడికక్కడే నిధులు సేకరించి ఫౌండేషన్ వారికి ఆర్థిక సహాయం అందించింది. 

వాషింగ్టన్ డీసీలో జరిగిన మహిళా దినోత్సవ వేడకలో మహిళలకు విద్యా, వైద్యా, ఫైనాన్షియల్‌, సోషల్, బిజినెస్‌ టాపిక్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారీగా మహిళలు హాజరైన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ విమెన్‌ జెన్నిఫర్‌ వెస్ట్న్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల అభ్యన్నతి కోసం కృషి చేస్తున్న కవిత చల్ల, ఇందిరా కుమార్‌, అవంతిక నక్షత్రంలను ఆటా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. 

న్యూజెర్సీలో జరిగిన ఉమెన్స్‌ డే కార్యక్రమంలో హోమియోపతి, యోగ, బిజినెస్‌ టాపిక్స్‌పైన చర్చించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేషనల్‌ ఉమెన్స్‌ చైర్‌ ఇందిరి రెడ్డి, ఇమ్మిగ్రేషన్‌ లాయర్‌ ప్రశాంతి రెడ్డిలను ఆటా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి సంస్థ కార్యకలాపాలు, విలువలు, సేవల గురించి వివరించారు.
 డల్లాస్‌లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలు అంశాలపైన మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భోజనాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.   

రాలీలో ఏర్పాటు చేసిన ఉమెన్స్‌ డే వేడుకలకు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యరంగంలో నిష్ణాతులయిన డాక్టర్స్‌ పాల్గొని బ్రెస్ట్‌ క్యాన్సర్‌, మమ్మోగ్రఫీల గురించి అవగాహన కల్పించారు. పౌష్టిక ఆహారం, ఫైనాన్షియల్‌ సెక్యూరిటీ విషయాల మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. పలువురు మహిళలను ఆటా సభ్యులు సత్కరించారు.  

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top