జవాన్లనుంచీ లంచం డిమాండ్.. రేప్ బాధిత అరెస్ట్... | Woman who accused RPF jawans of rape caught extorting money | Sakshi
Sakshi News home page

జవాన్లనుంచీ లంచం డిమాండ్.. రేప్ బాధిత అరెస్ట్...

Sep 10 2016 2:51 PM | Updated on Sep 4 2017 12:58 PM

ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. డబ్బుకోసం కక్కుర్దిపడి అడ్డంగా బుక్కైంది.

థానెః ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. డబ్బుకోసం కక్కుర్దిపడి అడ్డంగా బుక్కైంది. నిందితులైన జవాన్లనుంచి లంచం డిమాండ్ చేస్తూ పోలీసులకు చిక్కింది.

నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ దివాకు చెందిన మహిళ గతవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో ఉండగానే సదరు బాధితురాలు.. కేసును వెనక్కు తీసుకునేందుకు నిందితులతో బేరసారాలకు దిగింది. అందులో భాగంగా  నిందితుల్లోని ఓ జవాన్ ను.. మధ్యవర్తితోపాటు  చాటుగా ఓ హోటల్ లో కలసి లంచం డిమాండ్ చేస్తూ పోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రదీప్ సింగ్ (57) వద్ద 90,000 లంచం తీసుకునేందుకు సిద్ధపడిన బాధిత మహిళ పోలీసుల కంటపడింది. స్థానిక దొంబివిలి లోని ద్వారకా హోటల్లో నిందితురాలు జవాన్లతో జరిపిన సంభాషణ రికార్డు చేసినట్లు పోలీస్ పీఆర్వో సుఖద నర్కర్ తెలిపారు. అనంతరం మహిళను అరెస్టు చేశామని, ఆమె జవాన్ల నుంచీ  1,11,000 రూపాయలు డిమాండ్ చేసిందని, ఈ వ్యవహారంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తో బేరం కుదిర్చేందుకు మధ్యవర్తులుగా మోహన్ బిట్లా అనే వ్యక్తితోపాటు, స్థానికంగా పేరొందిన ఓ పత్రికలో పనిచేసే విలేకరి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళతో సహా బిట్లాను కూడా అరెస్ట్ చేసినట్లు  పోలీసులు వివరించారు. దివాకు చెందిన నిందితురాలు దొంబివిలిలోని ఓ బొటిక్ లో పనిచేస్తోంది. సెంట్రల్ రైల్వేకు చెందిన నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఆమె గతవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. జవాన్లపై ఐపీసీ 376-డి, 326 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement