బీజేపీ కోతులను బంధిస్తాం
కోల్కతా: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను కోతితో పోలుస్తూ తృణమూల్ నేత, అసన్సోల్ నగర జితేంద్ర తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కోతుల ఆట కట్టిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసన్సోల్ నగరంలోని 22 రథయాత్ర ఉత్సవ కమిటీలకు రూ. 25 వేల చొప్పున ఇవ్వాలన్న తివారి నిర్ణయాన్ని సుప్రియో ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి కట్మనీ రూపంలో దోచుకున్న డబ్బును తిరిగిస్తున్నారని పేర్కొన్నారు. తనను ఎద్దేవా చేసిన సుప్రియోను కోతితో పోలుస్తూ తివారి తాజాగా విరుచుకుపడ్డారు. అసన్సోల్లో జరిగిన అల్లర్లకు బీజేపీ కార్యకర్తలే కారణమని అంతకుముందు తివారి ఆరోపించారు. జార్ఖండ్ నుంచి మనుషులను తీసుకొచ్చి అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు. ఈ ఘటనల్లో తృణమూల్ కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారని తెలిపారు.