షెల్టర్‌ హోం కేసు : నిందితుడికి వైద్య పరీక్షలు

Supreme Court Ordered Medical Examination Of Rape Case Accused Brajesh Thakur - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్‌ ఠాకూర్‌ను పటియాలా జైలు అధికారులు తీవ్రంగా వేధించారనే ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. తక్షణమే ఠాకూర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు గురువారం అధికారులను ఆదేశించింది.

పటియాలా జైలు సూపరింటెండెంట్‌ డబ్బు కోసం తనను వేధిస్తున్నారని బ్రజేష్‌ ఠాకూర్‌ ఆరోపించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ముజఫర్‌పూర్‌లో ఎన్జీవో పేరిట బాలికల వసతి గృహం నిర్వహించే బ్రజేష్‌ ఠాకూర్‌ 34 మంది అనాధ బాలికలను లైంగికంగా నెలల తరబడి వేధించిన కేసులో ప్రధాన నిందితుడైన విషయం తెలిసిందే.

బిహార్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో బ్రజేష్‌కు సంబంధాలున్నాయి. బ్రజేష్‌తో తన భర్తకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలపై బిహార్‌ సాంఘిక సంక్షేమ మంత్రి మంజు వర్మ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. మైనర్‌ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఆయనపై సీబీఐ విచారణ సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఠాకూర్‌ సహా పలువురిని సీబీఐ అరెస్ట్‌ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top