ఎమ్మెల్యే రమేశ్ పౌరసత్వంపై తేల్చండి
- కేంద్ర హోం శాఖకు సుప్రీం కోర్టు ఆదేశం
- 6 వారాల సమయమిచ్చిన ఉన్నత న్యాయస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పౌరసత్వ నిర్ధారణపై 6 వారాల్లో తేల్చాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఎన్నిక చెల్లదంటూ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రమేశ్ ఎన్నిక చెల్లదని, భారత పౌరుడు కాద ని 2013లో హైకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టులో రమేశ్ అప్పీలు చేయగా దీనిపై స్టే విధించింది.
స్టేను తొలగించాలని ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం గతే డాది ఆగస్టులో విచారించింది. భారత పౌరసత్వం కోరుతూ 2008లో రమేశ్ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత పౌరసత్వం తిరిగి పొందగోరే వారు కనీసం ఏడాది పాటు దేశంలో ఉండాలి. అయితే ప్రభుత్వ విచారణ జరిపగా 96 రోజులే ఉన్నట్లు తేల్చింది. దీంతో సమాధానం ఇవ్వాలంటూ హోం శాఖ రమేశ్కు నోటీసులిచ్చింది. ఇలాంటి పరిస్థితిలో త్రిసభ్య కమిటీతో విచారణ జరపాలని చట్టం చెబుతోందని, త్రిసభ్య కమిటీ వేయాలని హోం శాఖను రమేశ్ కోరారు. 2012లో త్రిసభ్య కమిటీతో విచారణ జరిపినా నివేదిక ఇవ్వలేదు. ఈ నివేదిక హోం శాఖ వద్ద పెండింగ్లో ఉందని పిటిషనర్ ధర్మాసనానికి విన్నవించడంతో రమేశ్ పౌరసత్వ స్థితిపై 3 నెలల్లో తేల్చాలని, సంబంధిత నివేదికను హైకోర్టుకు సమర్పించాలని 2016 ఆగస్టు 11న సుప్రీం ఆదేశించింది.
ఈ ఆదేశాలు వెలువడ్డ కొంతకాలానికి కేంద్ర హోం శాఖ కోరిన గడువు పూర్తి కావడంతో సోమవారం మరోసారి శ్రీనివాస్ సుప్రీంను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలు కాలేదని కోర్టుకు విన్నవిం చడంతో.. 6 వారాల్లో కేంద్ర హోం శాఖ దీన్ని తేల్చాలని ధర్మాసనం ఆదేశించింది.