పోల్ ధమాకా : వడ్డీ రేట్లలో కోత..?
సాక్షి, బెంగళూర్ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్కు ముందు ఆర్బీఐ వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన భేటీ గురువారం ముగియనుండటంతో వడ్డీ రేట్ల తగ్గింపుపై కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకోవచ్చని రాయటర్స్ పోల్ అంచనా వేసింది. గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ నియామకం తర్వాత గత నెలలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో తాజాగా మరోసారి వడ్డీ రేట్లలో కోత ఉంటుందని భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటం, వృద్ధి మందగించిన నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్బీఐ సమర్ధించుకుంది. మారిన కేంద్ర బ్యాంక్ వైఖరితో తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతుందని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు, డిమాండ్ను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించాల్సిందిగా పరిశ్రమ వర్గాలు ఎంతోకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలూ దిగివస్తాయని ఆయా కస్టమర్లు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆర్థిక వ్యవస్థ పురోగతికి బీజేపీ విజయం ఉపకరిస్తుందని రాయటర్స్ పోల్లో పలువురు పేర్కొన్నారు.