అమర్‌సింగ్‌ పశ్చాత్తాపం

Regret My Overreaction Against Amitabh Bachchan: Amar Singh - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుకు సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్‌సింగ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘బిగ్‌ బి’ పట్ల అతిగా ప్రవర్తించానని ఒప్పుకున్నారు. ‘ఈరోజు నా తండ్రి వర్ధంతి సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ నుంచి నాకు మెసేజ్‌ వచ్చింది. ఒకానొక సమయంలో మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చాను. చావుతో పోరాడి ఇప్పుడిలా ఉన్నాను. అమితాబ్‌బచ్చన్‌, ఆయన కుటుంబం పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాను. వారిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను’ అని అమర్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. మూత్రపిండం పాడవడంతో కొన్నేళ్ల క్రితం ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఒకప్పుడు అమితాబ్‌కు ఆప్తుడిగా మెలిగారు. అయితే అమితాబే తమ స్నేహానికి ముగింపు పలికారని గతంలో అమర్‌ సింగ్‌ వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

2017లో ఓ ఇంటర్వ్యూలో అమర్‌సింగ్‌ మాట్లాడుతూ.. అమితాబ్‌, జయబచ్చన్‌ వివాహ సంబంధం సవ్యంగా సాగడం లేదని, వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. జయబచ్చన్‌ సమాజ్‌వాదీ పార్టీ సభ్యత్వాన్ని అంగీకరించొద్దని తనను అమితాబ్‌ హెచ్చరించారని అప్పట్లో అమర్‌సింగ్‌ తెలిపారు. అంతేకాదు అమితాబ్‌ అప్పుల్లో ఉన్నప్పుడు తాను ఎంతో సహాయం చేశానని, తాను జైలులో ఉన్నప్పడు కనీసం చూడటానికి కూడా రాలేదని వాపోయారు. తనకు బెయిల్‌ వచ్చిన తర్వాతే చూడటానికి వచ్చారని, అప్పుటికే తన మనసు విరిగిపోయిందని.. అమితాబ్‌తో మాట్లాడటానికి మనసు రాలేదన్నారు. మనుషులు ఇంత అవకాశవాదులుగా ఉంటారా అని అమర్‌ సింగ్‌ వాపోయారు. అయితే అమితాబ్‌, ఆయన కుటుంబం పట్ల తానే అత్యుత్సాహం ప్రదర్శించానని తాజాగా అమర్‌సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. (రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్రైజ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top