కరోనా : వేడి వేడి సమోసా కావాలా నాయనా! | Rampur man asks lockdown helpline made to clean drains | Sakshi
Sakshi News home page

కరోనా : వేడి వేడి సమోసా కావాలా నాయనా!

Mar 30 2020 5:28 PM | Updated on Apr 1 2020 12:58 PM

Rampur man asks lockdown helpline made to clean drains - Sakshi

మహమ్మారి కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక  ఏర్పాట్లు చేశాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో కూడా ఒక ఆకతాయి తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. బాధితులకోసం ఏర్పాటు  చేసిన  హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి ఒక వింత కోరిక కోరాడు.  దీంతో అప్పటికే ఇలాంటి అసంబద్ద కాల్స్ తో విసుగు చెందిన  జిల్లా ఉన్నతాధికారి సదరు వ్యక్తికి  తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అంతేకాదు సంక్షోభ సమయంలో కీలకమైన సేవలందిస్తున్న సమయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి  కాల్స్ తో  విసిగిస్తే.. ఇలాంటి గుణపాఠమే చెబుతామంటూ హెచ్చరించారు.  

కరోనా బాధితుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాంపూర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు  ఫోన్ చేసిన  ఒక వ్యక్తి తనకు వేడి వేడి సమోసాలు కావాలని కోరాడు. అంతకు ముందు పిజ్జా డెలివరీ కావాలని  అడిగాడు. పలుమార్లు ఇలాగే చేయడంతో చిర్రెత్తుకొచ్చిన డిఎం ఆంజనేయ కుమార్ సింగ్ అతగాడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతను అడిగినట్టుగానే సమోసాలను అతనికి పంపించి, అనంతరం సదరు వ్యక్తిచేత డ్రైనేజీ శుభ్రం చేయించారు. దీనికి సంబంధించి ఆయనొక పోస్ట్ షేర్ చేశారు. తమ అమూల్య సమయాన్నివృధా చేస్తే ఇలానే వుంటుందనేసందేశాన్నిచ్చారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా వుండాలని సూచించారు. దీంతో డీఎం చర్యను పలువురు నెటిజన్లు అభినందించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వారిని ఇలా విసిగించడం తగదని మండిపడుతున్నారు. కలిసికట్టుగా పోరాడి కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునివ్వడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement