హెచ్ఐవీ ఉందని స్కూల్ నుంచి తరిమేశారు | Private school bans HIV+ boy in West Bengal | Sakshi
Sakshi News home page

హెచ్ఐవీ ఉందని స్కూల్ నుంచి తరిమేశారు

Jan 15 2016 8:24 PM | Updated on Sep 3 2017 3:44 PM

హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ ఏడేళ్ల చిన్నారిని పాఠశాల నుంచి బహిష్కరించారు. సమాజానికి అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే పసివాడి పట్ల అమానుషంగా వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బిష్ణుపూర్ (పశ్చిమ బెంగాల్) : హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ ఏడేళ్ల చిన్నారిని పాఠశాల నుంచి బహిష్కరించారు. సమాజానికి  అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే పసివాడి పట్ల అమానుషంగా వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బిష్ణుపూర్ గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఏడేళ్ల చిన్నారి హెచ్ఐవీ బాధితుడు. ఈ విషయం తెలిసిన సదరు పాఠశాల యాజమాన్యం విద్యార్థిని స్కూలుకు రావద్దంటూ హుకూం జారీ చేసింది. పిల్లాడిని ఎందుకు స్కూల్ నుంచి బహిష్కరించారో తెలుసుకునేందుకు వెళ్లిన విద్యార్థి నానమ్మతో కూడా దురుసుగా వ్యవహరించింది. పరుషమైన పదజాలం ఉపయోగించడంతో పాటు ముందు 'ప్యూరిటీ టెస్ట్' చేయించుకుని రావాల్సిందిగా అదే పాఠశాలకు చెందిన మరో టీచర్ శెలవిచ్చారు.  

అయితే మీడియా ద్వారా విషయం బహిర్గతమవడంతో తెలుసుకున్న మానవహక్కుల కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించి.. నాలుగు వారాల్లో పూర్తి సమాచారంతో కూడిన నివేదిక అందించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రజల్లో అవగాహనా రాహిత్యం వలనే ఇటువంటివి జరుగుతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. నిజానిజాలు తెలుసుకుని బాధితుడికి న్యాయం చేస్తామని, బాలుడి హక్కులను కాపాడుతామని కమిషన్ స్పష్టం చేసింది.

ఐదు నెలల క్రితం హెచ్ఐవికి గురైన బాలుడి ఆరోగ్యం గురించి పక్కా సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం.. మిగతా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బలమైన అభ్యర్థన మేరకు నవంబరు 20వ తేదీన బాలుడిని స్కూలు నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరింది. కాగా బాలుడి తల్లిదండ్రులిద్దరు హెచ్ఐవీ బాధితులే.

Advertisement
 
Advertisement
Advertisement