
రానున్నది కాషాయ విప్లవం
‘అప్పట్లో దేశంలో హరిత విప్లవం వచ్చింది. ఇప్పుడిక కాషాయ విప్లవానికి సమయం ఆసన్నమైంది’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.
దేశాన్ని కాంగ్రెస్ చీకట్లోకి నెట్టింది: నరేంద్ర మోడీ
నీముచ్ (మధ్యప్రదేశ్): ‘అప్పట్లో దేశంలో హరిత విప్లవం వచ్చింది. ఇప్పుడిక కాషాయ విప్లవానికి సమయం ఆసన్నమైంది’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలు తనకు స్పష్టంగా కన్పిస్తున్నాయన్నారు. దేశంలోకెల్లా అతి పెద్దదైన 130 మెగావాట్ల సౌర విద్యుత్కేంద్రాన్ని బుధవారం ఇక్కడికి సమీపంలోని భగవాన్పురలో ఆయన దేశానికి అంకితం చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. యూపీఏ సర్కారు విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేయడం ద్వారా దేశాన్ని చీకటి యుగాల్లోకి నెట్టేసిందంటూ మండిపడ్డారు. 20 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లు యూపీఏ నిర్వాకం వల్ల మూతబడ్డాయన్నారు. బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నా కేంద్రం కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ అథఃపాతాళానికి దిగజారిందని, రూపాయి విలువ పతనమైందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో 2015 కల్లా 25,000 మెగావాట్ల అదనపు విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు.
ఎకనామిక్ హబ్గా ఈశాన్యం: ఈశాన్య భారతాన్ని ఎకనామిక్ హబ్గా మార్చడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా మోడీ తన మేధో బృందానికి సూచించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఈశాన్య ప్రాంతాభివృద్ధి శాఖను పునరుద్ధరించే ఆలోచన ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అపార నీటి నిల్వలను సరిగా ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాల్లో వరద ముప్పును నివారించడంతో పాటు దేశ కరెంటు కష్టాలనూ శాశ్వతంగా పరిష్కరించవచ్చన్నారు.