
బిచ్చం అడిగినందుకు తలపై తన్నిన మంత్రి!
మధ్యప్రదేశ్ మహిళా మంత్రి యాచకుడైన ఓ బాలుడి తలపై తన్నిన వివాదం తీవ్ర దుమారం రేపుతున్నది.
బోఫాల్: మధ్యప్రదేశ్ మహిళా మంత్రి యాచకుడైన ఓ బాలుడి తలపై తన్నిన వివాదం తీవ్ర దుమారం రేపుతున్నది. బాలుడి పట్ల అమానుషంగా వ్యవహరించిన మంత్రి కుసుమ్ మెహదెలె తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అంశంపై స్పందించారు. అవసరమైతే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. ' ఈ విషయమై మంత్రి నాకు వివరణ పంపించారు. దీనిని పరిశీలించిన అనంతరం అవసరమైతే దర్యాప్తు జరుపుతాం' అని సీఎం చౌహాన్ పేర్కొన్నారు. అప్పటివరకు ఈ విషయంలో సున్నితంగా స్పందించాలని అన్నివర్గాల వారిని కోరారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పశుసంవర్థక శాఖ మంత్రి కుసుమ్ మెహదెలె సోమవారం పన్నాలోని బస్టాప్ వద్ద రోడ్లను ఊడ్చారు. ఈ సమయంలో యాచకుడైన ఓ బాలుడు ఆమె వద్దకు వచ్చి.. ఓ రూపాయి భిక్షం ఇవ్వాల్సిందిగా అడుగుతూ.. ఆమె పాదాలు మొక్కేందుకు ముందుకు వంగాడు. దీంతో ఆగ్రహానికి గురయిన ఆమె భిక్షం ఇవ్వడానికి బదులు అతని తలపై తన్నారు. వెంటనే అక్కడికి వచ్చిన ఆమె భద్రతా సిబ్బంది అతన్ని దూరంగా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూడటంతో మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.