లేటు వయసులో ఓ తండ్రి ఘనకార్యం | Sakshi
Sakshi News home page

లేటు వయసులో ఓ తండ్రి ఘనకార్యం

Published Fri, Mar 8 2019 10:58 AM

Karnataka Old Man Married Young Women For Boy Child And Kicked Off  First Wife - Sakshi

సాక్షి, బెంగళూరు : లేటు వయసులో వారసుడు కావాలంటూ యువతిని పెళ్లాడి, భార్యా బిడ్డలను బజారు పాలుచేసిన ఓ ఘరానా వ్యక్తి ఉదంతమిది. బెళగావి తాలూకా కాకతి గ్రామానికి చెందిన బాళెగౌడ పాటిల్‌ (55) ఈ ఘనకార్యానికి పాల్పడ్డాడు. ఇతనికి 25 ఏళ్ల క్రితం అక్క మహదేవి అనే మహిళతో వివాహమైంది. వీరికీ ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. అయితే కొడుకు చిన్న వయస్సులోనే మరణించాడు. పెద్దమ్మాయికి ఇటీవలే పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో బాళెగౌడకు ఏం బుద్ధి పుట్టిందోగానీ తనకు వారసుడు కావాలంటూ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా భార్య, కుమార్తెలను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. సొంతూర్లో అయితే బాగుండదని బెళగావికి కొత్త కాపురం మార్చేశాడు.  

కాగా అక్క మహాదేవి నర్సుగా పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లనూ చదివిస్తోంది. హాస్టల్‌లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిల ఫీజులను కట్టడం తనకు కష్టంగా ఉన్నట్లు ఆమె వాపోతోంది. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్లు తండ్రిని వెతుక్కుంటూ బుధవారం ఇంటికి రాగా తాళం కనిపించింది. తమకు న్యాయం చేయాలని కాకతి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అమ్మాయిలకు మద్దతిచ్చారు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలను వీధిపాలు చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement