చెట్టెక్కితేనే హాజరు!

Jharkhand Teachers Climb Trees For Attendance - Sakshi

జార్ఖండ్‌లో టీచర్ల కష్టాలు 

రాంచీ: క్లాస్‌లో కూర్చొని.. రోల్‌ నంబర్‌ వన్‌.. రోల్‌ నంబర్‌ టూ.. అంటూ విద్యార్థుల అటెండెన్స్‌ తీసుకునే టీచర్లు తమ హాజరు నమోదు కోసం మాత్రం చెట్లెక్కుతున్నారు. హాజరు కోసం చెట్లెక్కడమేంటి.. అనే కదా? టీచర్లు సరిగ్గా పాఠశాలకు వస్తున్నారో? లేక రిజిస్టర్‌లో దొంగ సంతకాలు పెట్టి సొంతపనులు చక్కబెట్టుకుంటున్నారో? గుర్తించేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం ఇటీవలే కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ప్రతి స్కూల్‌లో ఓ ట్యాబ్లెట్‌ ఫోన్‌ ఉంటుంది. స్కూల్‌కు రాగానే దానిలో ఫేస్‌ రికగ్నేషన్‌ ఫీచర్‌తో హాజరును నమోదు చేయాలి.

ఆ వెంటనే సదరు టీచర్‌ ఆ రోజు స్కూల్‌కు వచ్చినట్లు అది విద్యాశాఖ కార్యాలయానికి హాజరు నమోదును పంపుతుంది. టెక్నాలజీ బాగానే ఉన్నా.. అసలు సమస్య సిగ్నల్స్‌తో వచ్చింది. ఆ రాష్ట్రంలోని పాలము జిల్లా, సోహ్రీఖాస్‌ గ్రామంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ అందాలంటే చెట్లెక్కాల్సిందే. దీంతో తమ హాజరు నమోదు చేయడానికి టీచర్లకు చెట్లెక్కక తప్పడంలేదు. టీచర్లు యువకులైతే సరే.. మరి వయసు పైబడినవారి సంగతేంటి? స్కూల్‌కు వచ్చినా.. గైర్హాజరైనట్లేనా? ఈ ప్రశ్నకు విద్యాశాఖ అధికారుల నుంచి మాత్రం సమాధానం రావడంలేదట.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top