లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. జైల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన దూషణలు... ఇరువర్గాల మధ్య దాడులకు కారణమైంది. చినికిచికిని గాలివానలా మారిన ఈ వ్యవహారం చివరకు షేవింగ్ బ్లేడ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకునేవరకూ వెళ్లింది.
ఇదే అదునుగా కొందరు ఖైదీలు జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకున్న ఒక సెక్యూరిటీ అధికారిపై దాడి చేశారు. ప్రస్తుతం అతని పరిస్ధితి బాగానే ఉందని జైలు సూపరింటిండెంట్ రాకేశ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వెల్లడించారు. కాగా గడిచిన రెండు నెలల్లో దేశంలోని నాలుగు జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణలు జరిగాయి.