బాల్య వివాహాల నిర్మూలనే ఆమె ధ్యేయం... | Her 13-Year-Old Friend Died in Labour. So She Fights Against Child Marriages Now | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నిర్మూలనే ఆమె ధ్యేయం...

Apr 26 2016 1:01 PM | Updated on Mar 28 2019 6:26 PM

బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నదే 24 ఏళ్ళ విజయలక్ష్మి ఆశయం. తన మిత్రురాలికి జరిగిన నష్టం మరెవ్వరికీ కలగ కూడదన్నదే ధ్యేయంతో సామాజిక కార్యకర్తగా మారి, బాల్యవివాహాలను అరికట్టేందకు అహర్నిశలు కృష్టి చేస్తోంది.

రాజస్థాన్ః పదమూడేళ్ళ పసిప్రాయంలోనే ఆమె.. మనసును కలచివేసే అనుభవాన్ని కళ్ళారా చూసింది. అభం శుభం తెలియని స్నేహితురాలు నిండు గర్భంతో ఉండి... ప్రసవానికి సహకరించలేక ప్రాణాలు కోల్పోవడం ఆమె మనసుపై చెరగని ముద్ర వేసింది. అప్పట్నుంచే ఆమెలో పోరాట భావం అంకురించింది. ఉన్నత చదువులే ఆశయంగా మలచుకోవడంతోపాటు, తన మిత్రురాలికి జరిగిన నష్టం మరెవ్వరికీ కలగ కూడదన్నదే ధ్యేయంతో సామాజిక కార్యకర్తగా మారి, బాల్యవివాహాలను అరికట్టేందకు అహర్నిశలు కృష్టి చేస్తోంది.

బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నదే 24 ఏళ్ళ  విజయలక్ష్మి ఆశయం. రాజస్థాన్ లోని ఫగి జిల్లా, జోరిందా భోజ్ పురా గ్రామంలో తన తల్లికి 14 ఏళ్ళ వయసులోనే ఆమె పుట్టింది. తర్వాత మరో ఇద్దరు సోదరులు కూడ జన్మించారు. ప్రస్తుతం విజయలక్ష్మి బిఈడీ పూర్తిచేసి టీచర్ గా పని చేస్తుండగా పెద్ద తమ్ముడు 22 ఏళ్ళ. విజయ్,  20 ఏళ్ళ చిన్న తమ్ముడు మహేష్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. ముగ్గురుకీ తమ స్నేహితుల్లా కాక చదువుకునే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నారు. అయితే తమ ఉన్నత చదువులకోసం తల్లిదండ్రులను ఒప్పించడం కూడ విజయలక్ష్మికి ఓ సవాలే అయ్యింది.

విజయలక్ష్మికి 13 ఏళ్ళ వయసుండగా తనకంటే కొంచెం పెద్ద వయసున్న తన స్నేహితురాలికి పెళ్ళి చేశారు. ఒక సంవత్సరం తర్వాత ఆమె గర్భవతి అయింది. అయితే అతి చిన్నవయసులో గర్భం కారణంగా  అనుకోకుండా ప్రసవం సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పట్నుంచే విజయలక్ష్మిలో తనకూ అదే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన మొదలైంది. అలాగే ఓ పక్క ఆమె చదువును కొనసాగిస్తున్నా బంధువులు, తల్లిదండ్రులు ఆమె పెళ్ళి విషయాలు చర్చించడం వింటూ ఉండేది. ఓరోజు ఉన్నట్లుండి నేను పెళ్ళి చేసుకోను అంటూ గట్టిగా అరిచింది. ఎప్పుడూ ఎంతో శాంతంగా ఉండే తమ కూతురు ఉన్నట్లుండి అంత పెద్దగా అరవడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తండ్రి సైలెంట్ గా ఉండిపోయినా తల్లి మాత్రం ఆమెను పెళ్ళికి ఒప్పించేందుకు ప్రయత్నించింది. అయితే కొంత సమయం తర్వాత మనసు కూడదీసుకున్న విజయలక్ష్మి తన మనసులోని భావాలను తల్లిదండ్రులకు వివరించింది.  నాకు మీ సపోర్ట్ కావాలంటూ తండ్రిని అభ్యర్థించింది. తల్లిదండ్రుల  మాటను తిరస్కరించడం తన ఉద్దేశ్యం కాదని,  పెళ్ళికి ముందు తాను చేయాల్సింది ఎంతో ఉందని అర్థమయ్యేట్లు వివరించింది. తండ్రి మాటివ్వడంతో విజయలక్ష్మి ఒక్కో అడుగూ ముందుకేసింది. సామాజిక కార్యకర్తగా మారి బాల్య వివాహాలను  నిర్మూలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

క్రమంగా కుటుంబ సభ్యులు కూడ ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. ఆమె తమ్ముడు హారోస్కోప్ రీడర్, ఆస్ట్రాలజర్ గా గ్రామస్థుల్లో గుర్తింపు పొందటంతో అతడి సహాయంతో బాలికల కుటుంబాల్లో 18 ఏళ్ళ కన్నా ముందు పెళ్ళి చేస్తే వారిలో వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నించింది. కుటుంబ ఉమ్మడి సహకారంతో విజయలక్ష్మి 15 నుంచి 20 వరకూ బాల్య వివాహాలు ఆపగలిగింది. ఆయితే ఆమె చేపట్టిన కార్యక్రమం అంత సులభమైందేం కాదు. మీ కూతుర్ని ఈ పిచ్చి వదలమని చెప్పమంటూ గ్రామస్థులనుంచీ తల్లిదండ్రులకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చేవి.  అలాగే విజయలక్ష్మికి కూడ బెదింరింపులు వచ్చేవి. అయినా ఆమె భయపడలేదు. ఏం చేస్తారో చెయ్యమంటూ వారిని ఎదిరించి నిలబడింది. ముఖ్యంగా తన స్నేహితురాలి మరణం, తానూ  పెళ్ళికూతురుగా మారాల్సొస్తుందన్న భయమే తనను సామాజిక కార్యకర్తగా మార్చాయని విజయలక్ష్మి చెప్తుంది. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే గ్రామస్థులకు తన సేవలందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement