పార్లమెంట్పై దాడి కేసు దోషి అఫ్జల్ గురు అవశేషాలను అప్పగించాలని కేంద్రాన్ని పీడీపీ డిమాండ్ చేసింది.
జమ్మూ: పార్లమెంట్పై దాడి కేసు దోషి అఫ్జల్ గురు అవశేషాలను అప్పగించాలని కేంద్రాన్ని పీడీపీ డిమాండ్ చేసింది. ఉగ్రవాది అఫ్జల్ను తీహార్ జైల్లో 2013, ఫిబ్రవరి 9న ఉరితీసి, అనంతరం ఖననం చేయడం తెలిసిందే. ‘అఫ్జల్ గురు మృతదేహ అవశేషాలను వెనక్కు తెప్పిస్తామన్నది పీడీపీ హామీ. ఆ దిశగా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆయన అవశేషాలను అప్పగించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘అఫ్జల్ గురు ఉరి న్యాయాన్ని అవహేళన చేయడమేనని పీడీపీ భావిస్తోంది. ఆ ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనలను పాటించలేదు. నిందితుల్లో 28వ వాడుగా ఉన్న అఫ్జల్గురును ప్రత్యేకంగా విచారించి, ఉరిశిక్ష విధించడాన్ని పీడీపీ అప్పుడే ఖండించింది. గురుకు క్షమాభిక్ష ప్రకటించి ఉండాల్సింది. అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రకటించాలన్న తీర్మానాన్ని 2011 కశ్మీర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వలేదు’ అని ఆ ప్రకటనలో వివరించారు.