హనీమూన్‌ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి! | Drama at IGI as woman disappears after returning from honeymoon | Sakshi
Sakshi News home page

హనీమూన్‌ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!

May 18 2016 9:11 AM | Updated on Sep 4 2017 12:23 AM

హనీమూన్‌ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!

హనీమూన్‌ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!

ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్‌దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు.

న్యూఢిల్లీ: ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్‌దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు. హనీమూన్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా భర్తకు షాకిస్తూ.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన వధువు అదృశ్యమైంది. సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులోని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన వధువు ఎంతకు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌)ను ఆశ్రయించాడు. దీంతో అతను, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

నీలిరంగు చీర కట్టుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన అతని భార్య.. బయటకు వచ్చేటప్పుడు మాత్రం బురఖా ధరించింది. సీసీటీవీ దృశ్యాల్లో ఆమె ఎత్తు, బరువు, నడకతీరును గమనించిన భర్త  బురఖాలో ఉన్నది తన భార్యేనని తెలుసుకొని బిత్తరపోయాడు. ఆమె బురఖా ముసుగు కప్పుకొని వెళ్లి ఓ వ్యక్తిని కలిసింది. అతనికి మరొకడు జత కలిశాడు. ఆ ముగ్గురు ట్యాక్సీల వద్దకు వెళ్లి జనంలో కలిసిపోయారు.

ఈ దృశ్యాలన్నింటినీ చూసి బిత్తరపోయిన ఆ నూతన వరుడు లబోదిబోమంటున్నాడు. లక్నో చెందిన ఓ వ్యక్తి విషయంలో ఈ ఘటన జరిగింది. పెళ్లయి హనీమూన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత అతని భార్య తన ప్రియుడితో కలిసి లేచిపోయి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఉద్దేశపూరితంగానే ఆమె తన హ్యాండ్‌ బ్యాగ్‌ను, సెల్‌ఫోన్‌ను భర్త వద్ద వదిలేసి వెళ్లిందని భావిస్తున్నారు. ఈ దృశ్యాలు చూసి దిగ్భ్రాంతుడైన సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతని భార్య స్వచ్ఛందంగా వెళ్లిపోవడంతో ఆమె ప్రియుడితో కలిసి వెళ్లి ఉంటుందని, బాధితుడు ఫిర్యాదు చేయనందున కేసు కూడా నమోదు కాకుండానే ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందని పోలీసులు అంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement