‘శేఖర్రెడ్డి కేసు: ఆర్బీఐ మాటలు నమ్మశక్యంగా లేవు’
సాక్షి, చెన్నై: టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, తమిళనాడు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్రెడ్డికి రూ. 2000 కొత్త నోట్లు ఎలా వచ్చాయో తెలియదని ఆర్బీఐ చెప్పింది. దీనిపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా చెప్పడం ఆశ్యర్యకరమని అన్నారు. ఆ కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక పోవడం వల్లనే కేసు విచారణలో జాప్యం జరుగుతున్నదని సీబీఐ చెప్పడం దిగ్ర్భాంతికరమన్నారు.
సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంల అక్రమార్జనకు శేఖర్ రెడ్డి బినామీ కథానాయకుడనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని చెప్పారు. కరెన్సీ ముద్రణాలయాలు, బ్యాంకులు ఆర్బీఐ అదుపాజ్ఞల్లో పనిచేస్తాయి. వీటి నుంచి శేఖర్రెడ్డికి భారీ మొత్తంలో సొమ్ము ముట్టిన సంగతి తమకు తెలియదని ఆర్బీఐ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ కోరిన వివరాలు అందజేయాలని ఆర్బీఐని ఆయన కోరారు. శేఖర్రెడ్డి కేసు నీరుగారిపోకుండా చూడాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్బీఐకి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్త