
న్యూఢిల్లీ: గత అక్టోబర్లో ధరలు ఒక్కసారిగా పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైలుకు గట్టి షాకే తగిలింది. ధరల బాదుడు భరించలేక రోజుకు మూడు లక్షలమంది చొప్పున గత నెలలో ప్రయాణికులు తగ్గిపోయారు. సెప్టెంబర్ నెలలో ఢిల్లీ మెట్రోలో రోజుకు సగటున 27.4 లక్షల మంది ప్రయాణించగా.. అక్టోబర్ నెలకు వచ్చేసరికి రోజు ప్రయాణికుల సంఖ్య 24.2 లక్షలకు తగ్గిపోయింది. ధరల పెరుగుదల కారణంగా 11శాతం మంది ప్రయాణికులు తగ్గిపోయారు.
ఒక ఆర్టీఐ దరఖాస్తుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఢిల్లీ, రాజధాని ప్రాంతం కలుపుకొని మొత్తం 218 కిలోమీటర్ల మెట్రోనెట్వర్క్ ఉంది. ద్వారాక నుంచి నొయిడా వరకు మెట్రో రైల్లో ప్రయాణించవచ్చు. ఢిల్లీలో సాధారణంగా ప్రయాణికులు మెట్రోరైల్లో ప్రయాణించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇటీవలికాలంలో మెట్రోరైల్ ప్రయాణికులు గణనీయంగా తగ్గారు. గత సంవత్సరాల్లో లేనివిధంగా ఈసారి మెట్రోలో ప్రయాణించేవారు తగ్గుతున్న ట్రెండ్ కనిపిస్తోంది.