కథువా కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, శ్రీనగర్ : బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలకు బ్రేక్ పడటం లేదు. జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత కవిందర్ గుప్తా వెనువెంటనే కథువా హత్యాచార కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన చాలా చిన్నదని..దీనికి ఏమంత ప్రాధాన్యత ఇవ్వరాదని గుప్తా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బీజేపీ నేత వివరణ ఇచ్చారు. కథువా వంటి కేసులు చాలా ఉన్నాయని మాత్రమే తాను అన్నానని దీన్ని వివాదాస్పదం చేయవద్దని కోరారు.
కథువా కేసు సర్వోన్నత న్యాయస్ధానం పరిథిలో ఉన్నందున దీన్ని పదేపదే ప్రస్తావించడం సరైంది కాదన్నారు. కథువా కేసు విచారణను ఛండీగర్కు బదలాయించాలని, సీబీఐకి అప్పగించాలని పలు పిటిషన్లు దాఖలైన క్రమంలో మే 7వరకూ ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది జనవరి 10న కథువాకు సమీపంలోని గ్రామం నుంచి 8 ఏళ్ల మైనర్ బాలికను అపహరించిన దుండగులు లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.