ఫేస్‌బుక్‌ సీఈఓకు భారత కోర్టు సమన్లు | Bhopal District Court Mark Summoned To Facebook CEO Mark Zuckerberg | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ సీఈఓకు భారత కోర్టు సమన్లు

Apr 27 2018 10:20 AM | Updated on Jul 26 2018 5:23 PM

Bhopal District Court Mark Summoned To Facebook CEO Mark Zuckerberg - Sakshi

భోపాల్‌ : ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు భోపాల్‌ జిల్లా కోర్టు సమన్లు పంపింది. భోపాల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ద ట్రేడ్‌బుక్‌.ఆర్గ్‌’ అనే స్టార్టప్‌ వ్యవస్థాపకుడు స్వప్నిల్‌ రాయ్‌ ఫిర్యాదు మేరకు అడిషినల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి పార్థ్‌ శంకర్‌ జుకర్‌బర్గ్‌కు ఈ మెయిల్‌ ద్వారా నోటీసులు పంపాలని ఆదేశించారు. ఈ వివాదంపై స్వప్నిల్‌ స్పందిస్తూ తాను నిర్వహిస్తున్న ద ట్రేడ్‌బుక్‌  బిజినెస్‌ నెట్‌ వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ అని తెలిపారు.

తన పెయిడ్‌ అడ్వర్జైజ్‌మెంట్‌ని ఫేస్‌బుక్‌ అర్థాంతరంగా నిలిపివేసిందని ఆరోపించారు. తన ట్రేడ్‌బుక్‌ ప్రచారాన్ని మూడు రోజుల పాటు నిర్వహించిన ఫేస్‌బుక్‌ తర్వాత తన టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్‌ నోటీసులు పంపిందన్నారు. తన వెబ్‌ పేజ్‌ మొదటి దశ ప్రమోషన్స్‌ 2016 ఆగస్టు 8 నుంచి 16 వరకు విజయవంతగా నిర్వహించామని.. రెండో దశ 2018 ఏప్రిల్‌ 14 నుంచి 21 మధ్య నిర్వహించాల్సి ఉండగా, ఫేస్‌బుక్‌ 16వ తేదీ నుంచి తన పేజ్‌ ప్రమోషన్‌ని నిలిపివేసిందని స్వప్నిల్‌ పేర్కొన్నారు. 

తన వెబ్‌ పేజ్‌కి అధికారిక ట్రేడ్‌మార్క్‌ ఉందని ఆయన స్పష్టం చేశారు. తన వెబ్‌ పేజ్‌ టైటిల్లోని బుక్‌ పదాన్ని తొలగించాలని నోటీసులు పంపారని, ఇది తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసిందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement