భర్తను బస్సు దించి రివాల్వర్‌తో కాల్పులు | Bengaluru Woman Shot her Husband thrice and arrested | Sakshi
Sakshi News home page

భర్తను బస్సు దించి రివాల్వర్‌తో కాల్పులు

May 6 2017 7:05 AM | Updated on Sep 5 2017 10:34 AM

కారులో నిందితురాలు హంసవేణి

కారులో నిందితురాలు హంసవేణి

మద్యం సేవించి వివాహిత హల్‌ చల్‌ చేయడంతో పాటు ఏకంగా భర్తను బస్సునుంచి కిందకు దించి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది.

బెంగళూరు: మద్యం సేవించి వివాహిత హల్‌ చల్‌ చేయడంతో పాటు ఏకంగా భర్తను బస్సునుంచి కిందకు దించి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది. అడ్డు వచ్చిన ప్రజలపై గన్‌ ఎక్కు పెట్టింది. దగ్గరకు వచ్చారో కాల్చి పారేస్తానని వీరంగం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్‌ వద్ద చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. 

సాయిరామ్‌(53) సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్‌ రెసిడెన్సిలో శుక్రవారం సాయంత్రం సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు. మార్గం మధ్యలో ఏదో విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో వాహనం వీరసంద్ర గేట్‌ సమీపంలోకి రాగానే భర్త సాయిరామ్‌ కారు దిగి  బీఎంటీసీ బస్సు ఎక్కాడు. ఇక అంతే.. ఆగ్రహించిన భార్య కారును వేగంగా బస్సు ముందుకు తీసుకొచ్చి ఆపింది. భర్తను బలవంతంగా బస్సునుంచి కిందకు దింపి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది. దీంతో మూడు బుల్లెట్లు  కడుపు, ఎద బాగంలో దూసుకెళ్లాయి.

స్థానికులు ఆమెను నిలువరింపేందుకు యత్నించగా వారిపై రివాల్వార్‌ ఎక్కు పెట్టి మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్‌ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్‌ను చికిత్స నిమిత్తం స్పర్శా ఆస్పత్రికి తరలించారు. సాయిరామ్‌కు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement