ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తున్నారా..?

Adultery Food Distributing in Online Food Delivery Hotels Tamil Nadu - Sakshi

కాస్త.. ఆలోచించండి

తగ్గింపు ధరలతో ఇచ్చే ఆహారంలో నాణ్యత లేమి

జిమ్మిక్కులకు పాల్పడుతున్న పలు హోటళ్ల యజమానులు

అధికారులకు ఫిర్యాదులు

నాణ్యత లేకుంటే 7659045567 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు

తమిళనాడు : డిస్కౌంట్‌లో కావాల్సిన ఆహారం లభిస్తోందంటూ సెల్‌ఫోన్‌ నుంచే ఆన్‌లైన్‌లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్‌ ఇస్తున్నారా..? ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన ఆహారంలో నాణ్యత లోపం ఉందంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆన్‌లైన్‌ వినియోగదారుల విషయంలో జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన ఆహారానికి ఒక నాణ్యతతో..రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారులకు పంపిణీ చేసే ఆహారానికి మరో నాణ్యతను పాటిస్తున్నారు. తిరుపతిలో పలు హాటళ్లలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అధికారులకు రెండు మూడు రోజుల మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి, తీవ్ర స్థాయిలో యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోదఫా ఇలాంటివి పునరావృతం అయితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  

ధర తక్కువ కదా అని ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్‌ చేస్తే అందులో నాణ్యత ఏమాత్రం ఉండడం లేదని పలువురు వినియోగదారులు ఆహార నియంత్రణ భద్రతా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.       ‘పాలక్‌ పనీర్‌ అసలు ధర రూ.200.. మీ కోసం రూ.140 కే అందిస్తున్నాం. చికెన్‌ బిర్యానీ రూ.250.. ప్రత్యేక ఆఫర్‌కింద మీకు రూ.149కే అందిస్తున్నాం.. ఈ ఆఫర్‌ రెండు రోజులు మాత్రమే. నాటు కోడి బిర్యానీ అసలు ధర రూ.299.. ఈ రోజు ప్రత్యేక ఆఫర్‌గా రూ.179కే అందిస్తున్నాం’ అంటూ 15 శాతం, 20 శాతం, 50 శాతం తగ్గింపు డిస్కౌంట్‌ వంటి రకరకాల ఆఫర్లతో ఫుడ్‌ డెలివరీ సంస్థలుఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ఆకర్షితులై ధర తక్కువని ఆర్డర్‌ చేస్తే అందులో నాణ్యత ఉండడం లేదు. బాగా లేని ఆహారాన్ని ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా పొందిన బాధితులు అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ సంస్థలతో పాటు రెస్టారెంట్లపై వినియోగదారుల ఫిర్యాదులతో ఆశాఖ అధికారులు పలు హోటళ్లు రెస్టారెంట్లపై దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌కు ప్రత్యేక ఆహారమా?

రెస్టారెంట్‌లో వండిన ఆహారానికి, ఆన్‌లైన్‌ ద్వారా పొందిన ఆహారానికి చాలా తేడా ఉంటోందని ఫిర్యాదులు అధికారులకు వచ్చినట్లు సమాచారం. ఆన్‌లైన్‌ ఆర్డర్‌కు వేరే ఆహారం ఇవ్వాలంటూ హోటళ్ల యజమానులు సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు సమాచారం.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు

రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లిన సమయంలో,ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ సంస్థల్లో నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రముఖ రెస్టారెంట్లు, ఎప్పుడూ జన సందోహం ఉండే హోటళ్లనుఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆహారం నిల్వ ఉండేందుకు అక్కడ అవకాశం ఉండదు. ముఖ్యంగా నాన్‌వెజ్‌ ఆహారం కొనుగోలు చేస్తున్న సమయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. కొన్ని హోటళ్లలో డిమాండ్‌ తగ్గిన సమయంలో మాంసం, తరిగిన కూరగాయలు తదితరాలను నిల్వచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా మిగిలిపోయిన వాటితో వండిన ఆహారం త్వరగా పాడయ్యే ఆస్కారముంది.

వేరుగావండేస్తున్నారు..
ఎక్కడో వండిన వంటకాలను రెస్టారెంట్‌ వరకు తీసుకొచ్చి ఆన్‌లైన్‌ వినియోగదారులకు అందజేస్తున్నట్లు కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ఇలా వండి పెట్టేందుకు చిన్న హోటళ్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. నాణ్యత పాటించకుండా వండిన ఆహారం వినియోగదారులకు చేరేసరికి పూర్తిగా పాడయిపోతున్న సందర్భాలు ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top