14న తెరపైకి రూపాయ్‌ | Sakshi
Sakshi News home page

14న తెరపైకి రూపాయ్‌

Published Tue, Jul 11 2017 3:07 AM

14న తెరపైకి రూపాయ్‌

తమిళసినిమా: రూపాయ్‌ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. గాడ్‌ పిక్చర్స్‌ పతాకంపై దర్శకుడు ప్రభుసాలమన్‌ నిర్మిస్తున్న చిత్రం రూపాయ్‌. ఆర్‌పీకే.ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ అధినేత ఆర్‌.రవిచందర్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చంద్రన్, ఆనంది జంటగా నటించారు. ఈ జంటను ప్రభుసాలమన్‌ తన కయల్‌ చిత్రం ద్వారా పరిచయం చేశారన్నది గమనార్హం.

కాగా కిశోర్‌రవిచంద్రన్, చిన్నిజయంత్, మరీష్‌ఉత్తమన్, ఆర్‌ఎస్‌ఆర్‌.మనోహర్, మారిముత్తు, వెట్ట్రివేల్‌రాజా తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన రూపాయ్‌ చిత్రానికి వి.ఇళయరాజా చాయాగ్రహణం, డీ.ఇమాన్‌ సంగీతం అందించారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎం.అన్బళగన్‌ నిర్వహించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ డబ్బు అందరికీ అవసరమేనన్నారు. అయితే దాన్ని న్యాయంగా సంసాదిస్తే జీవితం సంతోషంగా సాగుతుందన్నారు.

అదే అక్రమంగా అర్జిస్తే ఆ డబ్బు సమస్యల పాలు చేస్తుందనే ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం రూపాయ్‌ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంతకు ముందే విడుదల చేయనున్నట్లు వెల్లడించామని అయితే ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దు సంఘటనతో చిత్ర విడుదలను వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా ఈ నెల 14న రూపాయ్‌ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు అన్నారు.

Advertisement
Advertisement