చిత్రానికి ఆ ఇద్దరూ ముఖ్యమే!

Rashmika Mandanna Says Hero And Heroine Both Are Important For Each Film - Sakshi

చెన్నై : తరువాత బాధ పడదలుచుకోలేదు అంటోంది నటి రష్మిక మందన. అసలీ జాన బాధేంటో చూస్తే పోలా.. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌హాట్‌గా వినిపిస్తున్న పేరు రష్మిక. శాండిల్‌వుడ్‌కు చెందిన ఈ అమ్మడి పేరు టాలీవుడ్‌లో గీతాగోవిందం చిత్రంతో మారుమోగిపోయింది. అంతే అక్కడ క్రేజీ నటి అయిపోయింది. తాజాగా డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో మరోసారి లైమ్‌టైమ్‌లోకి వచ్చింది. కారణం గీతాగోవిందం చిత్ర కాంబినేషన్‌ రిపీట్‌ కావడం, చిత్రం టాక్‌కు సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించడం, చిత్రంలో ఘాటుఘాటు చుంబన దృశ్యాలు చోటుచేసుకోవడం వంటి అంశాలు రష్మికను మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చాయని చెప్పవచ్చు.

ఇక ఈ బ్యూటీ క్రేజ్‌ కోలీవుడ్‌ వరకూ పాకేసింది. ఇప్పటికే నటుడు కార్తీకి జంటగా నటిస్తోంది. ఇక దళపతి విజయ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం ఆయన 64వ చిత్రంలో ఎదురుచూస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఇక తెలుగులో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్న లక్కీ నటి రష్మిక. ఇలా ఒక రేంజ్‌లో ఖుషీ అవుతున్న ఈ బ్యూటీకి వాయిస్‌ పెరగడంలో ఆశ్చర్యం ఏం ఉంటుంది. అదే చేస్తోందీ అమ్మడు.

అసలేమంటోందీ ముద్దుగుమ్మ చూద్దామా..తమిళంలో కమర్శియల్‌ చిత్రాల్లో నటించమని చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే వాటిని నేను అంగీకరించడం లేదు. సత్తా లేని పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కాలాన్ని వృథాచేయడం నాకిష్టం లేదు. ఇకపోతే ఈగో అన్నది అందరికీ ఉంటుంది. నేను కమర్శియల్‌ చిత్రాల్లో నటించనని చెప్పడం దర్శకులకు కచ్చితంగా నచ్చదు. అయితే వారికి నా స్థానంలో ఉండి చూస్తే నేనెందుకు అలా అంటున్నానన్నది అర్థం అవుతుంది. నేను బొమ్మను కాను. కమర్శియల్‌ చిత్రాల్లోనే నటించుకుంటూపోతే నిర్ణీత కాలమే ఇక్కడ నిలబడగలను. ఎన్నేళ్లు ఈ రంగంలో ఉన్నానన్నదానికంటే నేను నటించిన చిత్రాలను చేసి గర్వపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి కమర్శియల్‌ చిత్రాల్లోనే నటించి ఆ తరువాత కాలంలో బాధ పడదలచుకోలేదు. ఒక చిత్రానికి హీరో, హీరోయిన్‌ ఇద్దరూ ముఖ్యమే. హీరో, హీరోయిన్‌ ఒకే లాగా శ్రమించి నటించినా, హీరోయిన్లు ఎక్కువ కాలం నిలబడడంలేదు. హీరోయిన్లు 15 ఏళ్ల పాటు ఈ రంగంలో కొనసాగినా, ఒకే లాగా ఉండదు అని రష్మిక పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top