నా పెళ్లి జరిగిపోయింది: రాఖీ సావంత్‌

Rakhi Sawant Confirms Marrying NRI - Sakshi

ముంబై: గత కొంతకాలంగా రాఖీసావంత్‌ పెళ్లిపై వస్తున్న ఊహగానాలు నిజమని తేలాయి. నిజాన్ని ఎన్ని రోజులని దాచగలమని భావించిందో ఏమో.. తన వివాహం ఓ ఎన్నారైతో జరిగిపోయిందని స్పష్టం చేసింది ఈ హాట్‌ బ్యూటీ రాఖీ సావంత్‌. ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాఖీసావంత్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ కొంతకాలంగా సోషల్‌ మీడియా కోడై కూసిన సంగతి తెలిసిందే. పైగా ఎప్పటికప్పడు వెడ్డింగ్‌ డ్రెస్‌, నిండైన పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. కేవలం ఫొటోషూట్‌ కోసమేనంటూ ముందు బుకాయించినప్పటికీ అసలు విషయాన్ని చెప్పక తప్పలేదు.

బ్రిటన్‌కు చెందిన బిజినెస్‌మాన్‌ రితేశ్‌ను పెళ్లి చేసుకున్నానంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాఖీ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘రితేశ్‌ నా వీరాభిమాని, ఓ ఇంటర్వ్యూలో తను నన్ను మొదటిసారిగా చూశాడు. తర్వాత మెసేజ్‌లు, కాల్స్‌తో దగ్గరయ్యాడు. ఇద్దరం మంచి మిత్రులయ్యాం. క్రమేణా మా బంధం మరింత బలపడి ప్రస్తుతం పెళ్లితో ఒక్కటయ్యాం. నేను జీవితాంతం తనతోనే ఉండిపోతాను. కానీ నాకింకా వీసా రాలేదు. వీసా రాగనే తనతోపాటు వెళ్లిపోతాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే టీవీ షోలో నటించాలన్న తన కోరికను నెరవేర్చుకుంటానని తెలిపింది ఈ హాట్‌ బ్యూటీ.

కాగా వీరిద్దరూ పెళ్లికి ముందే ఏడాదిన్నరపాటు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. వీరి మధ్య ప్రేమ బలపడటంతో ముంబైలోని ఓ హోటల్‌లో రాఖీసావంత్‌, రితేశ్‌లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను బయటికి వదలడంతో అభిమానులు పెళ్లయిపోయిందంటూ ప్రచారం చేయగా.. ఎట్టకేలకు.. ‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’ అంటూ రాఖీ సావంత్‌ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఇక ఫ్యామిలీ ప్లానింగ్‌ను కూడా అప్పుడే నిర్ణయించేసుకున్నట్లు.. 2020లో పిల్లల్ని కనాలి అనుకుంటున్నానని రాఖీ చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top