‘అందరూ నన్ను వదిలేసి వెళ్లిపోయారు’

Ananya Panday Comments On Scary Incident During Movie Shoot - Sakshi

సినిమాలో చూపించని సీన్‌ కోసం తాను చావు అంచుల దాకా వెళ్లాల్సింది వచ్చిందని హీరోయిన్‌ అనన్య పాండే అన్నారు. బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్‌లో రిస్కీ షాట్‌కు ప్రయత్నించినందుకు వల్ల.. తాను గాయపడినట్లు అనన్య పేర్కొన్నారు. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ చావు అంచుల దాకా వెళ్లాను. నిజానికి అప్పుడే చచ్చిపోవాల్సింది. కానీ ఎయిర్‌బ్యాగ్స్‌ తెరచుకోవడంతో బతికి పోయాను. నన్ను కాపాడేందుకు టైగర్‌ ముందుకు వచ్చాడు. కానీ కారు పేలిపోతుందనే భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ప్రతీ ఒక్కరు నన్ను వదిలి వెళ్లిపోయారు. ఎన్నో భయంకర యాక్సిడెంట్‌ స్టోరీలు విన్నాను. అయితే తొలిసారి ప్రత్యక్షంగా ఆ అనుభవం ఎదుర్కొన్నా’ అని చెప్పుకొచ్చారు.

చెట్టుకు కారు ఢీకొట్టడంతో తాను ప్రమాదానికి గురయ్యానని.. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరచుకున్నపుడు తన ముక్కు పగిలిందన్నారు. అయితే యూనిట్‌ వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత యథావిధిగా షూటింగ్‌లో పాల్గొన్నానన్నారు. ఇంత రిస్క్‌ తీసుకుంటే తీరా సినిమాలో అందుకు సంబంధించిన సీన్‌ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పుకొచ్చారు. కాగా 2012లో విడుదలైన సూపర్‌హిట్‌ సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సీక్వెల్‌గా తెరకెక్కిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2’ సినిమా అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మించిన ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించగా అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top