మరోసారి వార్తల్లోకెక్కిన అమలాపాల్‌!

Amala Paul Comments Over Step Out From Vijay Sethupathi Movie - Sakshi

సాక్షి, చెన్నై: ‘ఆడై’ టీజర్‌తో ప్రేక్షకులకు షాకిచ్చిన నటి అమలాపాల్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. సంచలనానికి బ్రాండ్‌నేమ్‌ అయిన ఈ భామకు.. ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం సర్వసాధారణంగా మారిందని చెప్పవచ్చు. తాజాగా విజయ్‌సేతుపతికి జంటగా నటించడానికి అంగీకరించి.. ఆ తరువాత ఆ చిత్రానికి కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా టాటా చెప్పినట్లు సమీపకాలంలో వార్తలు దొర్లిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఎస్‌పీ.జననాథన్‌ శిష్యుడు వెంకట్‌ తొలిసారిగా మెగాఫోన్‌ పట్టి విజయ్‌సేతుపతి హీరోగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చంద్ర ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది.

కాగా ఈ చిత్రం నుంచి అమలాపాల్‌ వైదొలగిందని, ఆమెకు బదులు నటి మేఘాఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా నటి అమలాపాల్‌ సరిగా సహకరించకపోవడంతోనే ఆమెను చిత్రం నుంచి తొలగించినట్లు ఒక ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన అమలాపాల్‌ ఈ చిత్ర నిర్మాతల తీరును తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటనను గురువారం మీడియాకు విడుదల చేశారు. అందులో తాను విజయ్‌సేతుపతి నటిస్తున్న చిత్రం నుంచి తొలగించబడ్డానని పేర్కొన్నారు. తాను సరిగా సహకరించని కారణంగానే తొలగించినట్లు చిత్ర నిర్మాతలు పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకూ తాను నటించిన చిత్రాలకు నిర్మాతలకు సపోర్టుగానే ఉన్నానని చెప్పారు. ఇంత కాలంగా నటిస్తున్న తనకు సినిమా రంగంలో ఉన్న అనుబంధంలో ఇలా ఎవరూ తనపై నేరం మోపలేదని వాపోయారు. భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రానికి తన పారితోషికంలో కొంత మొత్తాన్ని తీసుకోలేదని, అంతే కాకుండా ఆ చిత్ర నిర్మాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే తాను అప్పుగా కొంత డబ్బు ఇచ్చానని చెప్పారు.

చదవండి : బోల్డ్‌గా నటించిన అమలాపాల్‌

ఆడై టీజర్‌నే కారణం
వారు తనను చిత్రం నుంచి తొలగించడానికి కారణం ఆడై చిత్ర టీజర్‌ అని తనకు అనిపిస్తోందని అమలాపాల్‌ అన్నారు. చంద్రా ప్రొడక్షన్స్‌ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం అనాగరికం అని మండిపడ్డారు. నటించడానికి వచ్చిన తరువాత దేనికీ వెనుకాడని వారే నిజమైప నటి అన్నారు. తన పాత్రకు న్యాయం చేయాలనే తాను భావిస్తానని.. ఇకపై కూడా తాను ఇలానే చేస్తానని చెప్పారు. నటుడు విజయ్‌సేతుపతి అంటే తనకు గౌరవం ఉందని, ఆయనకు తాను అభిమానినని అమలాపాల్‌ పేర్కొన్నారు.

ఇక త్వరలో విడుదల కానున్న తన సినిమా ‘అదో అంద పరవై పోల’ చిత్ర షూటింగ్‌ చిన్న గ్రామంలో జరిగితే  అక్కడ ఎలాంటి వసతులు లేని చిన్న ఇంట్లో బస చేసినట్లు చెప్పారు. లో బడ్జెట్‌ చిత్రం కావడంతో రేయింబవళ్లు పని చేశానని... చిత్రం విషయంలో కాంప్రమైజ్‌ కాకూడదని చివరి రోజు షూటింగ్‌ ఖర్చు అంతా తానే భరించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ‘ఆడై’  చిత్రానికి చిన్న పారితోషికాన్నే తీసుకున్నానని, చిత్ర లాభాల్లో భాగం ఇస్తానని నిర్మాతలు చెప్పారని అమలాపాల్‌ తెలిపారు. విజయ్‌సేతుపతి సరసన నటించే చిత్రానికి కాస్ట్యూమ్స్‌ కొనుగోలు కోసమే ముంబైకి వెళ్లానని..చంద్రా ప్రొడక్షన్స్‌ సంస్థ బడ్జెట్‌ గురించి గోల పెట్టడంతో ఈ ఖర్చును తానే భరించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అలాంటిది సడన్‌గా ఈ చిత్ర నిర్మాత రతన్‌కుమార్‌ తనకు ఒక మేసేజ్‌ పంపి మీ నిబంధనలు తమ సంస్థకు సరిపడక పోవడంతో మీరు ఈ చిత్రానికి అవసరం లేదు అని పేర్కొన్నారని వాపోయారు. అయితే వారు ఈ నిర్ణయం తీసుకునే ముందు తనను పిలిచి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top