
పాక్ మహిళా రాయబారిపై ఉగ్రవాద ఆరోపణలు!
బంగ్లాదేశ్లో పనిచేస్తున్న పాక్ రాయబారిపై ఉగ్రవాద ఆరోపణలు రావడంతో.. ఆమెను పాక్ వెంటనే వెనక్కి పిలిపించింది.
బంగ్లాదేశ్లో పనిచేస్తున్న పాక్ రాయబారిపై ఉగ్రవాద ఆరోపణలు రావడంతో.. ఆమెను పాక్ వెంటనే వెనక్కి పిలిపించింది. ఇంతకుముందు దాదాపు ఏడాది క్రితం ఇలాగే ఓ పాకిస్థానీపై ఉగ్రవాద ఆరోపణలు రాగా, అప్పట్లో బంగ్లాదేశ్ ఆ రాయబారిని బహిష్కరించింది. తాజాగా ఫరీనా అర్షద్ అనే మహిళా రాయబారిని సొంత దేశానికి తీసుకెళ్లాలని పాక్ను బంగ్లా కోరింది. దాంతో వెంటనే ఆమెను వెనక్కి పిలిపించారు. ఢాకాలో ఉన్న పాక్ హైకమిషన్లోని రాజకీయ విభాగంలో సెకండ్ సెక్రటరీగా పనిచేస్తున్న అర్షద్ తమ దేశాన్ని వీడి వెళ్లిన విషయాన్ని బంగ్లా నిర్ధారించింది.
జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) అనే సంస్థకు చెందిన ఇద్రిస్ అనే ఉగ్రవాదిని పట్టుకున్నప్పుడు తమ సంస్థకు అర్షద్తో సంబంధాలున్నాయని, ఆమే తమకు డబ్బులు పంపుతోందని చెప్పారు. తాను ఆమెతో కలిసి ఆమె కారులోనే తిరిగానని, అప్పుడే ఆమె తనకు 382 డాలర్లు ఇవ్వగా.. తాను గత రెండేళ్లలో 48 సార్లు పాకిస్థాన్ వెళ్లి వచ్చానని ఇద్రిస్ చెప్పాడు.
కాగా, వారం రోజుల క్రితం అర్షద్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు కథనాలు రాగా, అవన్నీ నిరాధారమంటూ పాక్ హైకమిషన్ ఖండించింది. డిటెక్టివ్ బ్రాంచి నుంచి వచ్చిన లీకులనే కథనాలుగా రాశారంటూ విమర్శించింది. అయితే చివరకు అదే నిజమైంది.