
ఇరాక్ లో ఆత్మాహుతి దాడులు: 87 మంది మృతి
ఆత్మాహుతి దాడులతో ఇరాక్ అట్టుడుకుతోంది.
వాషింగ్టన్: ఆత్మాహుతి దాడులతో ఇరాక్ అట్టుడుకుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆత్మాహుది దాడులు ఇరాక్ లో కలకలం సృస్టిస్తున్నాయి. ఆదివారం, సోమవారం ఐఎస్ గ్రూపు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో సుమారు 87 మంది మృత్యువాతపడగా, మరో 117 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఇరాక్ రాజధాని బాగ్ధాద్, ముగ్దాడియా పట్టణం పై జరిగిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రదాడులను ఐక్యరాజ్యసమితి ఖండించింది. రాజధాని బాగ్ధాద్ లో, ముగ్దాడియా పట్టణంపై ఆదివారం ఐఎస్ జరిపిన దాడిని యూఎన్ఓ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఖండించారు.
దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ మిలిటెంట్లు నేటి వేకువజామున అంగీకరించారు. దీంతో ఐరాస ఈ ఘటనలపై తీవ్రంగా మండిపడుతోంది. ఏడుగురు షియా మిలిటెంట్లు ఈ ఉగ్ర ఘాతుకాలకు పాల్పడి ఉండొచ్చునని అధికారిక ప్రకటనలో ఐరాస పేర్కొంది. బాగ్ధాద్ ఘటనలో 53 మంది చనిపోగా, ముగ్దాడియా పట్టణంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 34 మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటివరకూ అక్కడ జరుగుతున్న ఐఎస్ దాడుల కారణంగా 22 వేల మందికి పైగా బలైపోయారు.