బ్రాండెడ్‌ బాటిళ్లలో విషం | Poisoning in Branded water bottles | Sakshi
Sakshi News home page

బ్రాండెడ్‌ బాటిళ్లలో విషం

Mar 16 2018 1:55 AM | Updated on Mar 16 2018 1:55 AM

Poisoning in Branded water bottles - Sakshi

న్యూయార్క్‌: దాహాన్ని తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు తాగాలన్నా భయపడే పరిస్థితులొచ్చాయి. తమ నీళ్లు అత్యంత సురక్షితమైనవని ప్రకటనలు గుప్పించే కంపెనీల నీళ్ల బాటిళ్లలో భారీగా సూక్ష్మస్థాయి ప్లాస్టిక్‌ అవశేషాలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అమెరికా, చైనా, భారత్, బ్రెజిల్, ఇండోనేసియా, కెన్యా సహా 9 దేశాల్లో న్యూయార్క్‌ స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. 9 దేశాల్లో ప్రజాదరణ పొందిన 11 బ్రాండ్లకు చెందిన 259 ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను పరీక్షించారు.

ఈ నీళ్ల బాటిళ్లలో సగటున ఒక్కోదానిలో 325 ప్లాస్టిక్‌ అవశేషాలు, గరిష్టంగా ఓ బాటిల్‌లో 10,000  ప్లాస్టిక్‌ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పరీక్షించిన 259 బాటిళ్లలో 90 శాతం వాటిలో ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నాయనీ, 17 బాటిళ్లలో ప్లాస్టిక్‌ అవశేషాలు లేవని తేల్చారు. జర్నలిజం ప్రాజెక్ట్‌ ఆర్బ్‌ మీడియా సూచన మేరకు తాము ఈ పరిశోధన చేశామన్నారు. కుళాయి నీళ్లతో పోల్చుకుంటే ఈ వాటర్‌ బాటిళ్లలో ప్లాస్టిక్‌ అవశేషాలు రెండింతలు అధికంగా ఉన్నాయి. దీంతో మంచినీళ్లలో ప్లాస్టిక్‌ వల్ల కలిగే ముప్పును సమీక్షిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

సరైన విధానం కాదు
నీళ్ల బాటిళ్లలో ప్లాస్టిక్‌ అవశేషాలను గుర్తించేందుకు ఆర్బ్‌ మీడియా, న్యూయార్క్‌ స్టేట్‌ వర్సిటీ అనుసరించిన విధానాన్ని నెస్లే సంస్థ తప్పుపట్టింది. శాస్త్రవేత్తలు వాడిన నైల్‌రెడ్‌డై సాంకేతికతతో కచ్చితమైన ఫలితాలు వెలువడే అవకాశం లేదని వెల్లడించింది. మరోవైపు, తాము కఠినమైన పద్ధతుల ద్వారా నీళ్ల శుద్ధీకరణను చేపడుతున్నట్లు కోకాకోలా బీబీసీకి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement