పిల్లలు ఆడుకునే ట్యూబ్పైకెక్కి.. రిపోర్టింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదాల్ని, ప్రకృతి విపత్తులను ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మీడియా రిపోర్టర్లు కాస్త వైవిధ్యంగా ఆలోచిస్తారు. ఘటన తీవ్రతను తమదైన శైలిలో ప్రజలకు అందిస్తారు. గతకొన్ని రోజులుగా కురస్తున్న భారీ వర్షాలకు పొరుగు దేశం పాకిస్తాన్లో గల లాహోర్ నగరం నీట మునిగింది. రోడ్లన్నీ ఈత కొలనులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కాలు బయటపెడదామన్నా కుదరని పరిస్థితి తలెత్తింది. అలా అని ఇంట్లో కూర్చుంటే సమాజంలో మీడియా పాత్ర ఏముంటుంది..!
అందుకే.. ఓ వార్తా చానెల్కు చెందిన రిపోర్టర్ భారీ వర్షాలతో అక్కడి జనం పడుతున్న కష్టాలను తెలియజేయడానికి వినూత్న పంథా ఎంచుకున్నాడు. లాహోర్ నడిబొడ్డున ఓ రోడ్డు స్విమ్మింగ్ పూల్ను తలపిస్తోందని.. నగరమంతా ఇదే పరిస్థితి అని అతను గంభీరంగా రిప్టోర్టింగ్ చేశాడు. అయితే, అతను చెప్పిన విషయాల కన్నా.. అతను వినూత్నంగా రిపోర్టరింగ్ చేసిన తీరే నెటిజన్లను ఆకట్టుకుంటోంది. స్విమ్మింగ్ పూల్లా మారిన రోడ్డు మధ్యలో చిన్న పిల్లలు ఆడుకునే ట్యూబ్లపై కూర్చొని.. చుట్టు పిల్లలు ఆడకునే ట్యూబ్ బొమ్మలు పెట్టుకొని.. అతను కథనాన్ని అందించాడు. లా‘హోరు’ బాధలను అతను పరిచయం చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.