ఫేస్బుక్ ఫాలోయర్ తెచ్చిన తంటా

ఫేస్బుక్ ఫాలోయర్ తెచ్చిన తంటా


లండన్ : ఫేస్బుక్లో చేసే పోస్టింగ్స్తో పాటు ఫాలోయర్స్ వల్ల కూడా సమస్యలొస్తున్నాయి. తెలిసో తెలియకో ఏదో పోస్ట్ చేయడం వల్ల ఇబ్బంది రావడమే కాదు. మనల్ని ఫాలో అవుతున్న వారి వల్ల కూడా తంటాలు తప్పడం లేదు. ఇటీవలి కాలంలో అమెరికా వెళుతున్న వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్యారిస్ బాంబు దాడుల ఘటన అనంతరం ఇలాంటి తనిఖీలు మరీ ఎక్కువయ్యాయి.



ఫేస్బుక్లో ఫాలోయర్స్ వల్ల ఇబ్బంది తలెత్తిన తాజా సంఘటన వెలుగు చూసింది. ఇదెవరికో కాదు అప్పటికే నాలుగు సార్లు అమెరికా పర్యటించిన అభ్యర్థికే ఈ సమస్య తలెత్తింది. బ్రిటన్కు చెందిన ఇమామ్ అజ్మల్ మస్రూర్కు అమెరికా అధికారుల నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్ కు చెందిన అజ్మల్ మస్రూర్ బ్రిటన్ లో స్థిరపడ్డాడు. 2010లో బ్రిటన్ లోని లిబరల్ డెమాక్రట్స్ తరఫున బేథల్ గ్రీన్ అండ్ బొ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బ్రిటన్ ముస్లిం కౌన్సిల్ సభ్యుడిగా పనిచేయడమే కాకుండా వివిధ టెలివిజన్ చానెళ్లకు ప్రజెంటర్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. ఇప్పటికే నాలుగుసార్లు అమెరికా పర్యటించిన అజ్మల్ డిసెంబర్ నెలలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్లోని క్వీన్స్ మసీదులో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్ హిత్రూ నుంచి జేఏఎఫ్ విమానాశ్రయానికి బయలుదేరగా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. అనుమతించేది లేదని తేల్చిచెప్పారు.



వీసా ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకున్నారని అజ్మల్ మస్రూర్ ప్రశ్నించినప్పుడు ఆయనకు అమెరికా అధికారుల నుంచి ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. ఆయన ఫేస్బుక్లోని 4500 మంది ఫాలోయర్స్లో ఒక వ్యక్తి అధికారులకు నచ్చలేదు. అజ్మల్ గతంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆయన బిజినెస్ వీసాను రద్దు చేసినట్టు అమెరికన్ ఎంబసీ అధికారులు వెళ్లడించారు.



ఫేస్బుక్లో వేలాది మంది తనను ఫాలో అవుతుంటారని, అందులో వారెవరో కూడా తనకు తెలియదని, దానిపై తనకు నియంత్రణ కూడా ఉండదని, నేను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా ఫాలో కావొచ్చు. సోషల్ మీడియా అదొక ఓపెన్ ఫోరం. పైగా అమెరికా అధికారులు ఎవరి గురించి చెబుతున్నారో కూడా సమాధానమివ్వలేదని అజ్మల్ అంటున్నారు. అమెరికా వెళ్లకుండా తనను ఎందుకు బ్యాన్ చేశారో చెప్పాల్సిన అవసరముందని అంటున్నాడు. ఈ విషయంలో అమెరికా అధికారుల సమాధానం కోసం వేచిచూస్తున్నా.. దాని తర్వాత న్యాయవాదులను సంప్రదిస్తానని అజ్మల్ చెబుతున్నారు. అమెరికా పర్యటించే విషయంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైన వారి వివరాల కోసం అజ్మల్ ఇప్పుడో వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top