ఇమ్రాన్‌ఖాన్‌కు ఇప్పుడు తెలిసొచ్చింది! | Imran khan comments on terrorism in Pakistan | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ఖాన్‌కు ఇప్పుడు తెలిసొచ్చింది!

Sep 13 2019 2:37 PM | Updated on Sep 13 2019 3:29 PM

Imran khan comments on terrorism in Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌ : అఫ్గనిస్తాన్‌లో సోవియట్‌ రష్యాకి వ్యతిరేకంగా అమెరికా సృష్టించిన తాలిబన్‌ జీహాదీలు ఇప్పుడు పాకిస్తాన్‌కు ముప్పుగా మారారని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. గురువారం ఆయన రష్యా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. అఫ్గనిస్తాన్‌లో సోవియట్‌ ప్రాబల్యాన్ని తగ్గించడానికి అమెరికా పాక్‌తో కలిసి ఉగ్రవాద గ్రూపులు సృష్టించిందని, ఆ తర్వాత రష్యా అఫ్గనిస్తాన్‌ నుంచి వెనుదిరగడంతో తర్వాతి కాలంలో ఉగ్రవాదులు అమెరికాకే ఎదురు తిరిగారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లను ఉగ్రవాదులు కూల్చివేయడంతో అమెరికా ఆల్‌ఖైదా, తాలిబన్‌ వంటి ఉగ్ర సంస్థలపై దాడులు చేపట్టింది. అయితే ఇప్పటికీ రెండు దశాబ్దాలైనా అమెరికా ఉగ్రవాదులను నిర్మూలించలేకపోయిందని ఆయన వెల్లడించారు. అమెరికా, ఉగ్రవాదుల మధ్య పోరులో అంతిమంగా పాకిస్తాన్‌ నష్టపోయిందని వాపోయారు.

‘ఉగ్రవాదుల వల్ల పాక్‌ వంద బిలియన్‌ డాలర్లకు పైగా నష్టపోయి ఆర్ధికంగా క్షీణించింది. అంతేకాక 70 వేల మంది మా దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత చేసినా ఉగ్రవాదులపై పోరులో అమెరికా విజయం సాధించకపోవడానికి పాకిస్తానే కారణం అనే నిందపడాల్సి వచ్చిందని’ ఇమ్రాన్‌ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ నేడు ఆర్ధికంగా చితికిపోయి బెయిలవుట్‌ ప్యాకేజీల కోసం, అప్పిచ్చేవారి కోసం దేబిరించాల్సి వస్తోందని, మొదట్లోనే జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి దాపురించేది కాదని విచారం వ్యక్తం చేశారు.

తాలిబాన్‌లతో చర్చలు జరిపి అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా వైదొలగాలని చూస్తుండటం తెలిసిందే. ఇప్పుడు దీనిపై ఇమ్రాన్‌ వాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. ఆఫ్గనిస్తాన్‌లో ఇప్పుడు అమెరికా తన సేనలను ఉపసంహరించుకోవడం వల్ల తాలిబన్‌లంతా తమ దేశానికి ముప్పుగా పరిణమించారని ఆయన భావిస్తున్నారు. ఆఫ్గనిస్తాన్‌ విషయంలో ముందునుంచీ తటస్థ వైఖరి తీసుకొని ఉంటే తమ దేశానికి ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయుండేదని ఇమ్రాన్‌ భావన. 

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలుస్తారనగా ఇమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలోనూ ఇమ్రాన్‌ పాల్గొంటారు. ఎన్నికల సందర్భంగా తమ దేశంలో ఉగ్రవాదులను నిర్విర్యం చేయడానికి గతపాలకులు రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకోలేకపోయారని ఇమ్రాన్‌ విమర్శించారు. నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తానని అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ కూడా ఉగ్రవాదులకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

చదవండి : 'అవును ఉగ్రవాదులకు వేలకోట్లు ఇచ్చాం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement