ఏ తల్లిదండ్రులు ఇలా చంపరేమో! | A teenage couple in Karachi were tied to a cot and electrocuted to death | Sakshi
Sakshi News home page

ఏ తల్లిదండ్రులు ఇలా చంపరేమో!

Sep 12 2017 11:21 AM | Updated on Apr 8 2019 6:21 PM

ఏ తల్లిదండ్రులు ఇలా చంపరేమో! - Sakshi

ఏ తల్లిదండ్రులు ఇలా చంపరేమో!

పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించుకొని పారిపోయి వివాహం చేసుకుందామనుకున్న ఓ యువజంట(అమ్మాయికి 15, అబ్బాయికి 17)ను ఇరు కుటుంబాల సభ్యులు కళ్లముందే అతి దారుణంగా చంపేశారు.

కరాచీ : పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించుకొని పారిపోయి వివాహం చేసుకుందామనుకున్న ఓ యువజంట(అమ్మాయికి 15, అబ్బాయికి 17)ను ఇరు కుటుంబాల సభ్యులు కళ్లముందే అతి దారుణంగా చంపేశారు. కుటుంబం పరువు తీశారని కళ్లెర్రజేస్తూ వారిద్దరిని నులక మంచానికి కట్టిపడేసి కరెంట్‌ షాక్‌ పెట్టి చంపారు. ఈ దృశ్యాన్ని ఊరంతా కూడా తిలకిస్తూ ఏ మాత్రం మానవత్వం లేనివారిగా వ్యవహరించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే కరాచీలోని జిర్గా అనే గిరిజన సంతతికి చెందిన ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

కానీ, వారిని పట్టి బందించి తీసుకొచ్చాక ఆ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపే జిర్గా అనే కులపెద్దల సంఘం సమావేశం ఏర్పాటుచేసింది. వారిద్దరు కుల పరువు తీశారని వారిని మంచానికి కట్టిపడేసి చంపేయాలని ఆదేశించడంతో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తూ రెండు కుటుంబాల ముందే మంచానికి కట్టిపడేసి కరెంట్‌ షాక్‌ పెట్టి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాలకు చెందిన వారిని, కుల పెద్దలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

తొలి రోజు అమ్మాయిని, రెండో రోజు అబ్బాయిని ఇలా చంపి పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఆ జంట తల్లిదండ్రులు ఒక ఒప్పందానికి వచ్చినా జిర్గా సంఘం అంగీకరించకపోవడంతో ఈ పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. జిర్గా సంఘం ప్రభుత్వ చట్టాలకంటే కఠినంగా పనిచేస్తుందని, ఆ ప్రజలు కూడా చట్టాలకంటే జిర్గా పెద్దల మాటలే పట్టించుకుంటారని తెలిపారు. ప్రతి ఏటా పరువు హత్యల్లో 500మంది పాకిస్థాన్‌ మహిళలు బలవుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement