
40 మంది తీవ్రవాదులు హతం
సినాయి ప్రావిన్స్ ఉత్తరప్రాంతంలో సైన్యం జరిపిన దాడుల్లో 40 మంది తీవ్రవాదులు చనిపోయారని ఈజిప్టు సైన్యం ప్రకటించింది.
కైరో(ఈజిప్టు): సినాయి ప్రావిన్స్ ఉత్తరప్రాంతంలో సైన్యం జరిపిన దాడుల్లో 40 మంది తీవ్రవాదులు చనిపోయారని ఈజిప్టు సైన్యం ప్రకటించింది. అల్-అరిష్, షేఖ్ జ్వాయెద్, రఫాహ్ పట్టణాల్లో ఉన్న తీవ్రవాదుల స్థావరాలపై గత వారం రోజులుగా సైనిక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా 52 స్థావరాల్లో ఉన్న 40మందిని మట్టుబెట్టి, ఐదుగురు తీవ్రవాదులను పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో మందులు, 25 వాహనాలతో పాటు, నాలుగు బైక్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు నాలుగు కారు బాంబులను, భారీగా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామని సైనిక వర్గాలు తెలిపాయి. 2011లో అధ్యక్షుడు ముబారక్ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి సినాయి ద్వీపకల్పంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.