ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న కరువు, తాగునీరు, సాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట పట్టనుంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న కరువు, తాగునీరు, సాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట పట్టనుంది. మే 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయాల ముందు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇంఛార్జ్ల సమావేశం జరిగింది. కరువు పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ ఫిరాయింపులు తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా సేవ్ డెమొక్రసీ పేరుతో ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరున లేదా మే మొదటి వారంలో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు వైఖరిపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.