'కేసీఆర్ కు చంద్రబాబు లొంగిపోయారు' | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ కు చంద్రబాబు లొంగిపోయారు'

Published Tue, May 3 2016 1:14 PM

'కేసీఆర్ కు చంద్రబాబు లొంగిపోయారు' - Sakshi

హైదరాబాద్: తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16, 17, 18 తేదీల్లో కర్నూలులో దీక్ష చేయనున్నారని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు లొంగిపోయారని భూమన ఆరోపించారు. అందుకే రంగారెడ్డి-పాలమూరు ప్రాజెక్టుపై చంద్రబాబు మాట్లాడటం లేదని విమర్శించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై వైఎస్ జగన్ పోరాటానికి సిద్ధమయ్యాక... చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, టీఆర్ఎస్ కు అనుకూలంగానే ఏపీ సర్కార్ పనిచేస్తోందన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలవాల్సిన ఏపీ సీఎం.. అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాలని సలహాలివ్వడం దారుణమని భూమన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన, వైఎస్ఆర్ సీపీ బలహీనం అవుతుందనుకోవడం భ్రమ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఆగడాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, అందుకే వైఎస్ జగన్ దీక్ష చేయనున్నారని వివరించారు. ఏపీ, తెలంగాణలో కొత్తగా ప్రాజెక్టులు కట్టాలంటే జలవనరులశాఖ అనుమతులుండాలని విభజన చట్టంలో ఉందని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement