గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య | unknown girl dead body found in narsing | Sakshi
Sakshi News home page

గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య

Sep 19 2016 9:53 AM | Updated on Jul 30 2018 8:29 PM

గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య - Sakshi

గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య

గొంతు కోసి, రాళ్లతో కొట్టి గుర్తు తెలియని యువతిని హత్య చేసిన ఘటన నార్సింగి ఠాణా పరిధిలో జరిగింది.

నార్సింగి: గొంతు కోసి, రాళ్లతో కొట్టి గుర్తు తెలియని యువతిని హత్య చేసిన ఘటన నార్సింగి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గండిపేట ప్రధాన రహదారిలోని వీఐఎఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రహారీ ప్రాంతంలోని చెట్ల పొదల్లోకి ఆదివారం సాయంత్రం 4.30కి గుర్తు తెలియని యువకుడు ఓ యువతిని తీసుకొచ్చాడు. అక్కడ ఇద్దరూ గొడవపడుతుండగా స్థానిక యువకుడు గమనించి వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  పోలీసుస్టేషన్‌ ఘటనా స్థలానికి 10 కిలో మీటర్ల దూరం ఉంటుంది.  సీఐ రాంచంద్రరావు, ఎస్‌ఐ ధనుంజయ్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే యువతి హత్యకు గురై పడి ఉంది. మృతురాలి వయసు 20 ఏళ్లు ఉంటాయి. గొంతుకోసి, రాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపించాయి. మృతురాలి ఒంటిపై బ్లూ జీన్స్, వైట్‌ టీషర్ట్‌ , బురఖా ధరించి ఉంది. చేతులు నల్లటి వస్త్రంతో కట్టేసి ఉన్నాయి. ఘటనా స్థలంలో మృతురాలికి సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు. యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారా? లేక శారీరికంగా వేధించి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ రాంచంద్రరావు తెలిపారు. యువతి ఎవరు అన్న విషయం తెలిస్తే అన్ని విషయాలు బహిర్గమౌతాయన్నారు. గండిపేట ప్రధాన రహదారితో పాటు సీబీఐటీ ప్రధాన రహదారిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.  బురఖా ధరించిన ఓ యువతి గుర్తు తెలియని యువకుడి బైక్‌పై ఈ మార్గంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ వాహనం యజమాని వివరాలు తెలుసుకొనే పనిలో పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement