రెచ్చిపోయిన కీచకులు... | Sexual assault on girl | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన కీచకులు...

Mar 15 2016 12:11 AM | Updated on Jul 23 2018 9:13 PM

కీచకులు రెచ్చిపోయారు. కామంతో కళ్లు మూసుకుపోయి అభం...శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

బాలికపై లైంగికదాడి: ముగ్గురి అరెస్టు
 
కీచకులు రెచ్చిపోయారు. కామంతో కళ్లు మూసుకుపోయి అభం...శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి  ఒడిగట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం...
 
యాకుత్‌పురా: బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను భవానీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భవానీనగర్ ఠాణాలో సంతోష్‌నగర్ ఏసీపీ వి.శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాస్‌రావుతో కలిసి తెలిపిన వివరాలు ప్రకారం... తలాబ్‌కట్టా రోడ్డు-3లో నివాసం ఉండే ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు.  భార్య మృతి చెందగా... కుమారుడు, కుమార్తె (16)తో కలిసి ఉంటున్నాడు. ఇతని కుమార్తెపై ఇదే ప్రాంతంలో ఉండే వివాహితుడు సయ్యద్ అబ్దుల్ (26)తో పాటు షేక్ యూనుస్ (26), మహ్మద్ ఫిర్దోస్ హుస్సేన్ (25) కన్నేశారు. తండ్రి, సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒక్కర్తే ఉన్న బాలికపై గతేడాది నవంబర్ నుంచి ముగ్గురూ పలుసార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈనెల 4న బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించగా గర్భం దాల్చినట్టు తేలింది. బాలికను నిలదీయగా అబ్దుల్, యూనుస్, ఫిర్దోస్ తనను భయపెట్టి ఈ ఘోరానికి ఒడిగట్టారని చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ 376 డీ , సెక్షన్ 6 ఆఫ్ పోస్కో యాక్ట్ 2012 ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.  

విద్యార్థినిపై అఘాయిత్యం..
జీడిమెట్ల: విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ డివిజన్ విజయనగర్ కాలనీకి చెందిన బాలిక(14) చింతల్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 12న తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై స్థానికుడు రమేష్ (19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
లైంగిదాడికి యత్నం...

అమీర్‌పేట: బాలికపై లైంగికదాడికి యత్నించిన ఘటన ఎస్‌ఆర్‌నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నగేష్ కథనం ప్రకారం... కుత్బుల్లాపూ ర్ గాజులరామారం కైసర్‌నగర్‌లో బాలిక (14) తన అమ్మమ్మతో కలిసి ఉంటోంది.  చిన్నప్పుడే బాలిక తండ్రి చనిపోగా.. తల్లి దుబాయ్‌లో ఉంటోంది. కాగా, రెండు నెలల క్రితం బాలిక తన అమ్మమ్మతో కలిసి బోరబండ బాబాసైలానీనగర్‌లో బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చింది. వివాహం అయ్యాక అమ్మమ్మ తన ఇంటికి వెళ్లిపోగా.. బాలిక బంధువు ల ఇంట్లోనే ఉంది.  ఇదిలా ఉండగా... మార్చి 3వ తేదీ రాత్రి 2 గంటలకు పెళ్లికొడుకు అన్న కుదూస్ బాలికను నిద్రలేపాడు. సెల్‌ఫోన్ లో గేమ్స్ పెట్టి ఇచ్చాడు. బాలిక గేమ్స్ చూస్తుండగా ఆమెతో అసభ్యం గా ప్రవర్తించాడు.  ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దని బెదిరించాడు. స్థానికుల సహాయంతో అమ్మమ్మ వద్దకు చేరుకున్న బాలిక జరిగిన విషయం చెప్పింది.  ఆదివారం రాత్రి ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... కుదూస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement