
ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనడి రమేష్ ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి హాలులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రమేష్తో ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకు ముందు జస్టిస్ రమేష్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను రిజి్రస్టార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ రమేష్ కుటుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజి్రస్టార్లు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు జస్టిస్ రమేష్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జస్టిస్ తుహిన్కుమార్తో కలిసి జస్టిస్ రమేష్ కేసులను విచారించారు.
27న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారం..
గుజరాత్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ అయిన న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ ఈ నెల 27న ప్రమాణం చేయనున్నారు. అలాగే కలకత్తా నుంచి ఏపీకి బదిలీ అయిన జస్టిస్ సుభేందు 29న ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురి రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది.