సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు. దీంతో, వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నలుగురు నెల్లూరు జిల్లా వాసులు చనిపోయారు. వారిని వింజమూరు మండలం గోల్లవారిపాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. వీరంతా హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
ఇక, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్9490 బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి.



