రాష్ట్రంలో కుటుంబ రాజ్యం | political family rooling in state :Digvijay Singh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కుటుంబ రాజ్యం

May 18 2016 2:58 AM | Updated on Aug 14 2018 3:55 PM

రాష్ట్రంలో కుటుంబ రాజ్యం - Sakshi

రాష్ట్రంలో కుటుంబ రాజ్యం

రాష్ట్రంలో కుటుంబ రాజ్యం నడుస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు.

కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం: దిగ్విజయ్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుటుంబ రాజ్యం నడుస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఎండలతో జనం చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దుయ్యబట్టారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో కుటుంబపాలన పర్యవసానాలు, ప్రజల ఇబ్బందులు, పూటకో నిర్ణయం వంటి వాటి గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఎన్‌ఆర్‌ఈజీ పథకాన్ని నీరుగారుస్తున్నారు. కూలీలకు వేతనాలను కూడా చెల్లించడం లేదు. రైతులకిచ్చిన పంట రుణమాఫీ హామీని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు’’ అని విమర్శించారు.

 సోనియాను అప్రతిష్ట పాలు చేసే కుట్ర: అగస్టా వెస్ట్‌ల్యాండ్ పేరుతో నెహ్రూ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కేంద్రంలోని బీజేపీ, ఆరెస్సెస్ కుట్రలు చేస్తున్నాయని దిగ్విజయ్ ఆరోపించారు. తమ హయాంలోనే ఆ హెలికాప్టర్ల కొనుగోలు కాంట్రాక్టును రద్దు చేశామని, ఆ కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టామన్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని అప్రతిష్ట పాల్జేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక లావాదేవీల్లో ఎవరి పాత్ర ఏమిటో రెండేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు తేల్చడం లేదని ఆయన ప్రశ్నించారు.

అశోకచక్ర హేమంత్ కర్కరేపై కూడా అసత్య ఆరోపణలు చేయడానికి తెగించడం దురదృష్టకరమన్నారు. మాలెగావ్, అజ్మీర్ దర్గా, మక్కా పేలుళ్లు, సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల ఘటనల్లో ఆరెస్సెస్‌కు ప్రత్యక్షంగా సంబంధముందని దిగ్విజయ్ ఆరోపించారు. ఉగ్రవాదాన్ని సమర్థించుకోవడానికి మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అంటూ విడదీయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంద న్నారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అమలు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలు తలెత్తవని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు నడుచుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement