
జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ బూత్లు ఆక్రమించైనా సరే లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డి(జగ్గారెడ్డి) బహిరంగ ప్రకటనలు చేసినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రాజనర్సింహ డిమాండ్ చేశారు
డిప్యూటీ సీఎం రాజనర్సింహ సతీమణి పద్మిని డిమాండ్
రాష్ట్రపతితోసహా పలువురికి లేఖలు రాసినట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ బూత్లు ఆక్రమించైనా సరే లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డి(జగ్గారెడ్డి) బహిరంగ ప్రకటనలు చేసినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రాజనర్సింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు, మెదక్ జిల్లా కలెక్టర్, మెదక్ జిల్లా ఎస్పీలకు లేఖలు రాసినట్లు ఆమె తెలిపారు.
ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని తన ప్రాజెక్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మిని రాజనర్సింహ మాట్లాడారు. ప్రజాప్రతినిధి అయిన జగ్గారెడ్డి పోలింగ్ బూత్లను ఆక్రమిస్తానని చెప్పటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయనవ్యాఖ్యలు ఎంతవరకు సరైనవో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలన్నారు. మెదక్ జిల్లా ప్రజలు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, ప్రజలు కోరుకుంటే సంగారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఓ ప్రశ్నకు జవాబుగా ఆమె చెప్పారు.