padmini damodara
-
లడ్డూ రూ.77,77,777.77
-
లడ్డూ రూ.77,77,777.77
♦ సంగారెడ్డిలో శ్రీవిరాట్ వేంకటేశ్వరస్వామి లడ్డూకు రికార్డు ధర ♦ వేలం పాటలో సొంతం చేసుకున్న దామోదర సతీమణి సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులోని శ్రీమహాలక్ష్మి గోదా సమేత శ్రీవిరాట్వెంకటేశ్వర స్వామి లడ్డూ వేలం పాటలో రికార్డు ధర పలికింది. మునుపెన్నడూ లేని విధంగా రూ.77,77,777.77 వెచ్చించి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంతో లడ్డూను దక్కించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో బాలాపూర్, కూకట్పల్లి ప్రగతినగర్ గణేశ్ లడ్డూ (బాలాపూర్-రూ.9.53 లక్షలు, ప్రగతి నగర్-రూ.15 లక్షలు) వేలం పాటల రికార్డు బ్రేక్ చేసినట్లయింది. ధనుర్మాసం సందర్భంగా శ్రీవైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో యేటా గోదా శ్రీని వాస కల్యాణం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వారి లడ్డూకు వేలంపాట నిర్వహించడం ఆనవాయితీ. గతేడాది నిర్వహించిన వేలం పాటలో టీఆర్ఎస్ నేత, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ రూ.7.77 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. బుధవారం స్వామివారి కల్యాణం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ , ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు లడ్డూ వేలం నిర్వహిం చారు. వేలం పాటలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 25 కిలోల లడ్డూకు ప్రారంభ వేలం పాటను రూ.7,777గా నిర్ణయించారు. అక్కడ్నుంచి వేలం మొదలవగా.. ఆలయ మహిళా కార్యకర్తలు రూ.3.80 లక్షల వర కు పాడారు. ఆ తర్వాత సంగారెడ్డికి చెందిన వైద్యుడు డా.కుమార్ రాజా రూ.55 లక్షలు పాడగా, పురం పాండ య్య కుటుంబీకులు రూ.65 లక్షలకు పాడారు. తర్వాత కుమార్ రాజా రూ.66 లక్షలకు పెంచగా.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని ఏకంగా రూ.77,77,777.77 వేలం పాట పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్, ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ... లడ్డూను కైవ సం చేసుకున్నవారికి అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. మంచి జరుగుతుందనే విశ్వాసంతోనే: పద్మిని దామోదర ఈ లడ్డూను దక్కించుకొనే వారికి అంతా మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉంది. అందుకే లడ్డూను కైవసం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ధర ఎక్కువైందని కాకుం డా.. లడ్డూను దక్కించుకున్నాననే సంతోషం ఉంది. -
జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
డిప్యూటీ సీఎం రాజనర్సింహ సతీమణి పద్మిని డిమాండ్ రాష్ట్రపతితోసహా పలువురికి లేఖలు రాసినట్టు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ బూత్లు ఆక్రమించైనా సరే లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డి(జగ్గారెడ్డి) బహిరంగ ప్రకటనలు చేసినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రాజనర్సింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు, మెదక్ జిల్లా కలెక్టర్, మెదక్ జిల్లా ఎస్పీలకు లేఖలు రాసినట్లు ఆమె తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని తన ప్రాజెక్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మిని రాజనర్సింహ మాట్లాడారు. ప్రజాప్రతినిధి అయిన జగ్గారెడ్డి పోలింగ్ బూత్లను ఆక్రమిస్తానని చెప్పటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయనవ్యాఖ్యలు ఎంతవరకు సరైనవో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలన్నారు. మెదక్ జిల్లా ప్రజలు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, ప్రజలు కోరుకుంటే సంగారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఓ ప్రశ్నకు జవాబుగా ఆమె చెప్పారు. -
పద్మిని దామోదర అడుగులెటు?
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రాజకీయ అరంగేట్రం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆమె సంగారెడ్డి నుంచే పోటీ చేస్తారని కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. పద్మిని కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు తన వద్దకు వచ్చే స్థానిక నేతలకు తోచిన సాయం చేస్తున్నారు. మరోవైపు జయప్రకాశ్రెడ్డిని విభేదిస్తున్న చాలామంది సంగారెడ్డి నేతలు ఎలాగైనా రానున్న ఎన్నికల్లో పద్మినీ దామోదర్ను తమ నియోజకవర్గం నుంచే బరిలో దింపాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే డిప్యూటీ ఎదుట ప్రస్తావించి ఆయన్ను ఒప్పించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్ పాటిల్ ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల దృష్టంతా ఆదివారం జరగనున్న ఏఐసీసీ పరిశీలకుడి భేటీపైనే కేంద్రీకృతమై ఉంది. సంగారెడ్డి టికెట్ ఆశించినట్లయితే ఆమే స్వయంగా ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి అవకాశం ఉంది. ఆమె సంగారెడ్డి టికెట్పై అంతగా మక్కువ చూపకపోతే మాత్రం ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ నేతలే ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి సంగారెడ్డి టికెట్ గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ రెండు జరగకపోతే మాత్రం ఆమె రాజకీయ అరగేంట్రంపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. బలప్రదర్శనకు సిద్ధమైన జయప్రకాశ్రెడ్డి ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్పాటిల్ ఆదివారం సంగారెడ్డికి రానున్న నేపథ్యంలో విప్ జయప్రకాశ్రెడ్డి తన సత్తా చూపేందుకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మరోమారు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆయన, తన మద్దతుదారులతో కలిసి ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడిని భేటీకానున్నట్లు సమాచారం. భారీ జన సమీకరణతో ఏఐసీసీ పరిశీలకుని ఎదుట తన సత్తా చాటిచెప్పి తద్వారా మరోమారు సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కైవసం చేసుకోవాలని జయప్రకాశ్రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరిస్తున్నట్లు సమాచారం.